నవతెలంగాణ-హైదరాబాద్: 15ఏళ్లలోపు చిన్నారుల సోషల్ మీడియా వినియోగంపై నిషేధం విధించే బిల్లును ఫ్రెంచ్ చట్టసభ సభ్యులు ఆమోదించారు. దిగువ సభలో సోమవారం రాత్రి నుండి మంగళవారం తెల్లవారుజాము వరకు సుదీర్ఘంగా జరిగిన సెషన్లో 130 నుండి 21 ఓట్ల తేడాతో తీర్మానం ఆమోదం పొందింది. ఫ్రాన్స్ ఎగువ సభ అయిన సెనెట్ ఆమోదం కూడా పొందితే ఈ తీర్మానం చట్టంగా మారుతుంది.
అధిక స్క్రీన్ సమయం నుండి చిన్నారులను రక్షించే చర్యగా అధ్యక్షుడు మాక్రాన్ ఈ చర్యను అభివర్ణించారు. దేశంలో చిన్నారులు,టీనేజర్స్ను రక్షించడానికి వేసిన ఈ ఓటు ప్రధాన చర్యగా ఆయన ప్రశంసించారు. 2026 విద్యా సంవత్సరం ప్రారంభం నుండి చర్యలు తీసుకోవాలని అధికారులు కోరుతున్నారు. సెప్టెంబర్ 1 నుండి నిషేధం అమల్లోకి వచ్చేలా ఫిబ్రవరి మధ్య నాటికి సెనెట్ బిల్లును ఆమోదిస్తుందని ఆశిస్తున్నట్లు దిగువ సభలో మాక్రాన్ పార్టీ రెనీయసెన్స్కి నాయకత్వం వహిస్తున్న మాజీ ప్రధాని గాబ్రియేల్ పేర్కొన్నారు.
16ఏళ్లలోపు చిన్నారులు సోషల్మీడియా వినియోగించడంపై ఆస్ట్రేలియా ప్రభుత్వం గతేడాది డిసెంబర్లో నిషేధం విధించిన సంగతి తెలిసిందే. చిన్నారుల సోషల్మీడియా వినియోగంపై నిషేధం విధించిన రెండవ దేశంగా ఫ్రాన్స్ నిలవనుంది.



