Friday, May 23, 2025
Homeట్రెండింగ్ న్యూస్సీఎం రేవంత్‌రెడ్డి ఓఎస్‌డీ పేరిట మోసాలు..

సీఎం రేవంత్‌రెడ్డి ఓఎస్‌డీ పేరిట మోసాలు..

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి వ్యక్తిగత కార్యదర్శినని, ఓఎస్‌డీనంటూ ప్రజలను మోసం చేస్తున్న యువకుడిని హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాలో బుధవారం అరెస్టు చేసి, గురువారం హైదరాబాద్‌లో రిమాండ్‌కు తరలించారు. సైబర్‌ క్రైమ్స్‌ డీసీపీ ధార కవిత తెలిపిన ప్రకారం… ఏపీలోని శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేట, లక్ష్మీనగర్‌లలో నివసించే మాజీ క్రికెటర్‌ బొడుమూరు నాగరాజు(32)… సీఎం రేవంత్‌రెడ్డి ఓఎస్‌డీ ఎట్‌ జీమెయిల్‌ డాట్‌ కామ్‌ పేరిట నకిలీ ఈ-మెయిల్‌    ఖాతా తెరిచాడు. తనకు తాను తెలంగాణ సీఎం వ్యక్తిగత కార్యదర్శినని, ఆఫీసర్‌ ఆన్‌ స్పెషల్‌ డ్యూటీ(ఓఎస్‌డీ) అని చెప్పుకొంటున్నాడు. అతడిపై తెలంగాణలో 13, ఆంధ్రప్రదేశ్‌లో 16 కేసులు ఉన్నాయి. నాంపల్లిలోని 12 ఏసీఎంఎం న్యాయస్థానంలో నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ సైతం పెండింగ్‌లో ఉంది. 

బొడుమూరు నాగరాజు… ఆర్థిక సాయం కావాలంటూ ప్రముఖ పారిశ్రామికవేత్తలకు, కంపెనీలకు మెయిళ్లు, వాట్సప్‌ సందేశాలు పంపిస్తున్నాడు. అందులో భాగంగా బొల్లినేని ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్‌ ఎండీ శ్రీకృష్ణమోహన్‌ బొల్లినేనిని సంప్రదించాడు. ర్యాపిడో ఎండీ అరవింద్‌ సంకా, గుప్తా రియాలిటీ ఛైర్మన్‌ శ్రీనివాస్‌ గుప్తా వెర్రబొమ్మ, కంట్రీడిలైట్‌ ఎండీ చక్రధర్, నితిన్‌ కౌశల్‌లతోపాటు ఎంతో మందిని ఆర్థిక సహాయం కోరే ప్రయత్నం చేశాడు. అతని తీరుపై సైబర్‌ పోలీసులకు ఫిర్యాదులు అందాయి. కేసు నమోదు చేసిన హైదరాబాద్‌ సైబర్‌ పోలీసులు సాంకేతిక ఆధారాలతో ఏపీలో అరెస్టు చేసి హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. కోర్టు ఆదేశాలతో గురువారం రిమాండ్‌కు తరలించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -