Friday, June 27, 2025
E-PAPER
Homeజాతీయంఆయుధాల నుంచి అణు వ్యవహారాల వరకూ..

ఆయుధాల నుంచి అణు వ్యవహారాల వరకూ..

- Advertisement -

మాస్కోకు గుడ్‌బై… వాషింగ్టన్‌కు వెల్‌కమ్‌
అమెరికాతో రక్షణ ఒప్పందాలకు తహతహ
విదేశాంగ విధానంపై చేజారుతున్న నియంత్రణ
ట్రంప్‌ను ప్రసన్నం చేసుకునేందుకు మోడీ ప్రభుత్వ తంటాలు

భారతదేశ విదేశీ విధానానికి అలీనోద్యమం, వ్యూహాత్మక స్వతంత్రత ఆయువుపట్టుగా నిలుస్తున్నాయి. అయితే ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్‌ షాలు ఆ వారసత్వానికి గుడ్‌బై చెప్పేశారు. ఫలితంగా విదేశీ విధానంలో వారు చేస్తున్న మార్పులు సామాన్య ప్రజలకు హాని కలిగిస్తున్నాయి
.
న్యూఢిల్లీ : ఈ ఏడాది ప్రారంభంలో డోనాల్డ్‌ ట్రంప్‌ అమెరికా అధ్యక్ష బాధ్యతలు స్వీకరించినప్పుడు ప్రధాని మోడీ ఆయనను అభినందించారు. అప్పుడు ట్రంప్‌ ‘అమెరికా నుండి మరిన్ని ఆయుధాలు కొనండి’ అని మోడీకి చెప్పారు. అప్పటి నుండి ట్రంప్‌, ఆయన సహాయకులు…రష్యా నుండి ఆయుధాలు కొనవద్దని, తమ వద్దే కొనాలని భారత్‌పై ఒత్తిడి తెస్తూనే ఉన్నారు. ఫిబ్రవరిలో ట్రంప్‌ను కలవడానికి మోడీ అమెరికా వెళ్లినప్పుడు కూడా ఇదే ఒత్తిడి కొనసాగింది. భారత రక్షణ వ్యవస్థలో అమెరికా యుద్ధ సామగ్రి చేరడాన్ని ఇరువురు నేతలు స్వాగతించారు. ఇప్పుడు మన రక్షణ వ్యవస్థలో అమెరికాకు చెందిన సీ-130జే సూపర్‌ హెర్క్యులస్‌, సీ-17 గ్లోబ్‌మాస్టర్‌ 3, పీ-81 పోసైడాన్‌ యుద్ధ విమానం, సీహెచ్‌-47ఎఫ్‌ చినూక్స్‌, ఎంహెచ్‌-60ఆర్‌ సియాహాక్స్‌, ఎంక్యూ-9బీ సహా పలు హార్డ్‌వేర్‌ సామగ్రి చేరిపోయింది.
రష్యా భాగస్వామ్యానికి స్వస్తి
అమెరికా ఇంతటితో ఆగిపోలేదు. మరో చాంతాడంత జాబితాను కూడా భారత్‌కు అందజేసింది. ఇందులో ట్యాంక్‌ విధ్వంసక జావెలిన్‌ క్షిపణులు, పదాతి దళం ఉపయోగించే యుద్ధ వాహనాలు, మరో ఆరు పీ-81 సముద్ర గస్తీ విమానాలు ఉన్నాయి. అమెరికా నుండి భారత్‌ మరిన్ని ఆయుధాలు, యుద్ధ సామగ్రిని కొనుగోలు చేయాలంటూ ఫిబ్రవరిలో ట్రంప్‌ విధించిన షరతులకు మోడీ అంగీకరించారు. ఈ జాబితాలో ఎఫ్‌-35 యుద్ధ విమానాలు, పీ-81 పోసైడాన్‌ యుద్ధ విమానం, హెలికాప్టర్లు, అమెరికా సైనిక వ్యవస్థలు ఉన్నాయి. రష్యా నుండి ఆయుధాల కొనుగోలును ఆపేసి పూర్తిగా తమ నుండే కొనడానికి మోడీ అంగీకారం తెలిపారని అమెరికా వాణిజ్య మంత్రి హోవర్డ్‌ లూత్నిక్‌ తాజాగా వెల్లడించారు. ఆ దిశగా భారత్‌ ఇప్పటికే అడుగులు వేయడం మొదలు పెట్టిందని కూడా ఆయన చెప్పారు. దీనిని బట్టి మనకు అర్థమవుతోంది ఏమంటే భారత్‌ తన చిరకాల భాగస్వామి రష్యా నుండి ఆయుధాలు కొనడం మానేసి అమెరికా, దాని సైనిక మిత్రదేశాలతో జతకడుతోంది.
విదేశాంగ విధానంపై చేజారుతున్న పట్టు
బ్రిక్స్‌్‌ కూటమి నుండి వైదొలగడానికి, డాలర్‌ ఆధిపత్యానికి గండికొట్టే చర్యలను అడ్డుకోవడానికి కూడా భారత్‌ అంగీకరించిందని ట్రంప్‌కు అత్యంత సన్నిహితుడైన లూత్నిక్‌ తెలిపారు. ఇందులో ఎలాంటి సందేహం లేదని కూడా చెప్పారు. ఫిబ్రవరి 13న శ్వేతసౌధం విడుదల చేసిన సంయుక్త ప్రకటన కూడా ఈ వాదననే ధృవీకరిస్తోంది. అమెరికా నుండి రక్షణ కొనుగోళ్లను, ఆ దేశంతో రక్షణ సహకారాన్ని ఆ ప్రకటన ప్రముఖంగా ప్రస్తావించింది. బీజేపీ తన విదేశాంగ విధానంపై నియంత్రణను చేజార్చు కుంటోందని ఆ పార్టీకి సన్నిహితంగా ఉంటే విదేశాంగ శాఖ మాజీ కార్య దర్శి కన్వల్‌ సిబల్‌ వంటి విశ్లేషకులు కూడా విచారం వ్యక్తం చేశారు. కానీ మోడీ ప్రభుత్వం వీటిని పట్టించుకో వడం లేదు. రష్యాతో ఆయుధ ఒప్పం దాలకు పూర్తిగా స్వస్తి చెప్పాలని భారత్‌ నిర్ణయించుకున్నదా? గతంలో పాలకులు అనుసరించిన విదేశాంగ విధానాన్ని విడనాడి అమెరికా, దాని సైనిక కూటమికి వత్తాసు పలుకుతోందా? ఈ ప్రశ్నలకు ప్రధాని నుండి సమాధానాన్ని కోరుకునే హక్కు దేశ ప్రజలకు ఉంది.
ఈ ఒత్తిళ్లు కూడా…
అమెరికా తన వద్ద ఉన్న అపార మిగులు నిల్వలతో భారతీయ మార్కెట్లను ముంచేస్తుందని సహకార డెయిరీ రంగంలోని పెద్దలు ఆందోళన చెందుతున్నారు. తన వద్ద పేరుకుపోయిన సోయాబీన్‌, గోధుమలు, పత్తి, సముద్ర ఆహారం, ఇథనాల్‌, పండ్లు, నట్స్‌ వంటి వ్యవసాయోత్పత్తులపై సుంకాలు తగ్గించాలని అమెరికా ఒత్తిడి తెస్తోంది. వీటిలో కొన్నింటిపై సుంకాలు తగ్గించేందుకు భారత్‌ అంగీకరించింది కూడా. జన్యుపరంగా అభివృద్ధి చేసిన పంటలపై అమెరికా ఒత్తిడి మరో సమస్యగా మారింది. ఆ పంటల ఆహారాన్ని భారత్‌ నిషేధించింది. ట్రంప్‌తో సంబంధాలను మరింత పెంచుకునే దిశగా మోడీ తన సీనియర్‌ సలహాదారు జాసన్‌ మిల్లర్‌ను వాషింగ్టన్‌లో లాబీయిస్టుగా నియమించడం ఈ పరిణామాలకు కొసమెరుపు అని సీనియర్‌ పాత్రికేయుడు, రాజకీయ వ్యాఖ్యాత పి.రామన్‌ చెప్పారు.
మోడీ పర్యటన తర్వాతే ఒప్పందాల జోరు
ప్రధాన స్రవంతి మీడియా ఇటీవలి కాలంలో విడుదల చేసిన డేటాను పరిశీలిస్తే అనుమానాలు బలపడక మానవు. ఆ డేటా ప్రకారం 2009లో రష్యా నుండి 79 శాతం రక్షణ దిగుమతులు జరగగా గత సంవత్సరం కేవలం 36 శాతం మాత్రమే జరిగాయి. రష్యాతో కలిసి హెలికాప్టర్లు, యుద్ధ విమానాలను తయారు చేసే ప్రణాళికలు కూడా అటకెక్కాయి. మరోవైపు అమెరికాతో ఏర్పడిన ఫెవికాల్‌ బంధం దినదినాభివృద్ధి చెందుతోంది. అమెరికాలో తయారైన రక్షణ పరికరాల కొనుగోలు కోసం 2018 నుండి ఇప్పటి వరకూ మన ప్రభుత్వం 20 బిలియన్‌ డాలర్ల విలువైన ఒప్పందాలపై సంతకాలు చేసింది. 31 దూరశ్రేణి డ్రోన్ల కొనుగోలుకు ఉద్దేశించిన మూడు బిలియన్‌ డాలర్ల ఒప్పందంపై ఇటీవలే సంతకాలు జరిగాయి. నెక్ట్స్‌ జనరేషన్‌ యుద్ధ విమానాల ఇంజిన్ల తయారీ కోసం హెచ్‌ఏఎల్‌-జీఈతో కూడా ఒప్పందం కుదిరింది. ఇవన్నీ 2023లో మోడీ అమెరికాలో పర్యటించిన వచ్చిన తర్వాత జరిగిన ఒప్పందాలే.
ఆ సవరణ అమెరికా సంస్థలకే లాభం
ఈ వ్యవహారాలేవీ ప్రధాన స్రవంతి మీడియాలో కన్పించడం లేదు. ప్రభుత్వ విధానాలపై 2014 నుండే మీడియాలో చర్చలు జరగడం లేదు. యూపీఏ హయాంలో అమెరికాతో కుదుర్చుకున్న అణు ఒప్పందంపై టీవీ ఛానల్స్‌లో విస్తృతంగా చర్చలు జరిగిన విషయం తెలిసిందే. అణు బాధ్యత విషయంలో మోడీ ప్రభుత్వం ట్రంప్‌ ఆదేశాలకు లొంగిపోయిందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. అణు లయబులిటీ చట్టాన్ని సవరించాలని ప్రభుత్వం నిర్ణయించిందని కేంద్ర ఆర్థిక మంత్రి ఈ ఏడాది తన బడ్జెట్‌ ప్రసంగంలో ప్రకటించారు. పరీక్షించని డిజైన్ల ఆధారంగా ప్లాంట్ల ఏర్పాటుకు ఇది మార్గం సుగమం చేస్తుంది. ఏదైనా ప్రమాదం జరిగితే విదేశీ సంస్థలను బాధ్యతల నుండి మినహాయిస్తామని ఏప్రిల్‌ 17న ప్రభుత్వం మరోసారి పునరుద్ఘాటించింది. ఈ మినహాయింపుల ద్వారా లబ్ది పొందేది ఎక్కువగా అమెరికా సంస్థలే. డిజైన్‌ లేదా లోపాల కారణంగా ఏదైనా ప్రమాదం సంభవిస్తే గతంలో ఉత్పత్తిదారును బాధ్యడిని చేసే వారు. ఇప్పుడు అలాంటి రక్షణ చర్యలన్నీ రద్దవుతున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -