నవతెలంగాణ-హైదరాబాద్: జీ-7 శిఖరాగ్ర సమావేశానికి ప్రధాని నరేంద్రమోడీ హాజరపై సందిగ్ధం నెలకొంది. జూన్ 15-17 వరకు కెనడా వేదికగా జరిగే ఈ సమావేశానికి భారతదేశానికి అధికారిక ఆహ్వానం రాకపోవడం లేదా భారతదేశం హాజరుకావడానికి ఇష్టపడటం లేదని అధికారిక వర్గాలు తెలిపాయి. గత ఆరేళ్లలో ప్రధాని జీ-7 సమ్మిట్కి వెళ్లకపోవడం ఇదే తొలిసారి. అయితే ఇప్పటికే దక్షిణాఫ్రికా, ఉక్రెయిన్, ఆస్త్రేలియా వంటి దేశాలకు కెనడా నుంచి ఆహ్వానాలు అందినట్లు ప్రకటించాయి. అయితే, ప్రధాని నరేంద్రమోడీ పర్యటనపై మాత్రం అనిశ్చితి కొనసాగుతోంది. జీ-7 అనేది ప్రపంచంలోని అత్యంత పారిశ్రామిక ఆర్థిక వ్యవస్థలైన ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, యునైటెడ్ కింగ్డమ్, జపాన్, యునైటెడ్ స్టేట్స్, కెనడాల కూటమి. అయితే, ఈ సమావేశాలకు యూరోపియన్ యూనియన్(ఈయూ), ప్రపంచబ్యాంక్, ఐఎంఎఫ్, ఐక్యరాజ్యసమితికి ఆహ్వానాలు అందాయి.
ఖలిస్తానీ ఉగ్రవాదులకు మద్దతు ఇవ్వడంపై కెనడాపై భారత్ ఆగ్రహంతో ఉంది. రెండేళ్ల క్రితం, ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత్ ప్రమేయం ఉందని అప్పటి కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించాడు. అప్పటి నుంచి రెండు దేశాల మధ్య దౌత్యసంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. అయితే ఇటీవల జరిగిన కెనడా సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో అధికార లిబరల్ పార్టీ విజయంభేరి మోగించింది. దీంతో నూతన ప్రధానిగా మార్క్ కార్నీ మరోసారి బాధ్యతలు చేపట్టారు. ఈక్రమంలో ఇరుదేశాల మధ్య దౌత్య సంబంధాలు ఏమేరకు పునరద్ధరించబడుతాయో వేచి చూడాల్సిందే.