నవతెలంగాణ-హైదరాబాద్: రష్యన్ చమురును కొనుగోలు చేస్తున్న భారత్, చైనాలపై భారీగా టారిఫ్లను విధించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రతిపాదనకు ఐరోపా సమాఖ్యతో పాటు, జి 7 దేశాలు అంగీకరించినట్లు తెలుస్తుంది. ఉక్రెయిన్లో శాంతి పునరుద్ధరణ చేయాలని, అందుకోసం రష్యాపై ఒత్తిడి తేవడమే సరైన మార్గం అని అందులో భాగంగా రష్యా చమురును కొనుగోలు చేస్తున్న భారత్, చైనాలపై భారీ టారిఫ్లు విధించాలని అమెరికా ప్రతిపాదించింది. శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్లో జి 7 దేశాలు సమావేశమయ్యాయి. ఈ భేటీలో సుంకాల విధింపుపై చర్చ సాగింది.
ఈ సందర్భంగా అమెరికా వాణిజ్య ప్రతినిధి జామిసన్ గ్రీర్ మాట్లాడుతూ … ఇప్పటికే భారత దిగుమతులపై అమెరికా భారీ సుంకాలు విధించిన విషయాన్ని ప్రస్తావించారు. ఈ క్లిష్ట సమయంలో నిర్ణయాత్మక చర్య తీసుకోవడానికి జీ 7 దేశాలు ముందుకురావాలని కోరారు. అందుకు జి 7 దేశాలు స్పందిస్తూ … యుద్ధం ముగింపునకు కట్టుబడి ఉన్నామని ప్రకటించాయి. రష్యాపై ఒత్తిడి తేవడానికి ఇంతకుముందు ఐరోపా సమాఖ్య (ఈయూ) దేశాల ముందు కూడా ట్రంప్ ఇలాంటి ప్రతిపాదనలే చేశారు. అయితే, ఈ విషయంలో ఈయూ దేశాల్లో భిన్నాభిప్రాయలు వ్యక్తమయ్యాయి. దీంతో అది సాధ్యపడలేదు. ఇవే ప్రతిపాదనలను ఆయన మళ్లీ జి 7 దేశాల ముందుపెట్టడం గమనార్హం. ఇప్పుడు కూడా టారిఫ్ల విధింపుపై ఐరోపా సమాఖ్య దేశాల నుంచి భిన్నాభిప్రాయలు వ్యక్తమయ్యాయి. ఫలితంగా అది ఇంకా సాధ్యపడలేదు.