- Advertisement -
నవతెలంగాణ హైదరాబాద్: ఓబుళాపురం మైనింగ్ కేసులో నాంపల్లి సీబీఐ కోర్టు తుది తీర్పు వెలువరించింది. సుదీర్ఘ విచారణ అనంతరం 15ఏళ్ల తర్వాత ఈ కేసులో మొత్తం ఐదుగురిని దోషులుగా, ఇద్దరిని నిర్దోషులుగా ప్రకటించింది. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న గాలి జనార్దన్ రెడ్డి, బీవీ శ్రీనివాసరెడ్డి, మెఫజ్ అలీఖాన్, గనుల శాఖ అప్పటి డైరెక్టర్గా ఉన్న వీడీ రాజగోపాల్ను దోషులుగా నిర్ధారిస్తూ శిక్షలు ఖరారు చేసింది. గాలి జనార్దన్రెడ్డి సహా ఐదుగురికి ఏడుళ్ల పాటు జైలు శిక్ష విధించింది. ఇదే కేసులో అప్పటి గనుల శాఖ మంత్రిగా ఉన్న సబితా ఇంద్రారెడ్డికి ఉపశమనం లభించింది. ఆమెతో పాటు అప్పటి పరిశ్రమల శాఖ కార్యదర్శి కృపానందంను సీబీఐ కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. అనంతపురం జిల్లా ఓబులాపురంలో అక్రమ మైనింగ్తో రూ.వేల కోట్లు సంపాదించి ప్రభుత్వాలను శాసించే స్థాయికి చేరిన గాలి జనార్దన్రెడ్డికి చివరకు ఇదే ఓబులాపురం మైనింగ్ కేసు ఉచ్చు బిగుసుకుంది. ఓబులాపురంలో సాగించిన అక్రమాలు నిజమేనని సీబీఐ కోర్టు తేల్చింది. ఈ కేసులో ఏ1గా ఉన్న బీవీ శ్రీనివాసరెడ్డి, ఏ2 గా ఉన్న గాలి జనార్దన్ రెడ్డి, ఏ3 గా ఉన్న వీడీ రాజగోపాల్, ఏ4 గా ఉన్న ఓఎంసీ కంపెనీ, ఏ7గా ఉన్న కె.మెఫజ్ అలీఖాన్లను దోషులుగా న్యాయస్థానం తెల్చింది. కాగా, ఏ8 అప్పటి గనుల శాఖ కార్యదర్శిగా ఉన్న కృపానందం, ఏ9గా 2004-2009 మధ్య గనుల శాఖ మంత్రిగా ఉన్న సబితా ఇంద్రారెడ్డిలను మాత్రం నిర్దోషులుగా కోర్టు ప్రకటించింది. ఈ కేసు విచారణలో ఉండగానే ఏ5 లింగారెడ్డి మృతి చెందగా... ఏ6 శ్రీలక్ష్మిని 2022లో కేసు నుంచి కోర్టు డిశ్చార్జి చేసింది.
- Advertisement -