నవతెలంగాణ-హైదరాబాద్: బ్రిటన్కు చెందిన సిక్కు యువతిపై ఆ దేశానికి చెందిన ఇద్దరు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. మంగళవారం ఉదయం 8.30 గంటలకు వెస్ట్ మిడ్ల్యాండ్స్ ఓల్డ్బరీలోని టేమ్ రోడ్ వద్ద ఉన్న పార్కులో 20 ఏళ్ల సిక్కు యువతిని ఇద్దరు శ్వేతజాతీయులు అడ్డుకున్నారు. ఆమెపై జాత్యహంకార వ్యాఖ్యలు చేశారు. ఆ సిక్కు యువతి బ్రిటన్కు చెందిన మహిళ కాదని, ఆమె దేశానికి తిరిగి వెళ్లాలని బెదిరించారు. అంతేగాక ఆ సిక్కు యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
బాధిత సిక్కు యవతి ఫిర్యాదుపై వెస్ట్ మిడ్ల్యాండ్స్ పోలీసులు స్పందించారు. జాత్యహంకార దాడిగా, ద్వేషపూరిత నేరంగా పరిగణిస్తున్నామని తెలిపారు. శ్వేతజాతీయులైన అనుమానితుల కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. ఇద్దరు నిందితులకు సంబంధించిన సమాచారం, సీసీటీవీ ఫుటేజ్, డ్యాష్క్యామ్ ఫుటేజ్, మొబైల్ ఫుటేజ్ వంటి ఆధారాలు అందించి సహకరించాలని ప్రజలను కోరారు.
మరోవైపు బ్రిటన్లోని సిక్కు సమాజం ఈ సంఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇటీవల కాలంలో జాత్యహంకార సంఘటనలు పెరుగడంపై సిక్కు ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. లేబర్ పార్టీ ఎంపీ ప్రీత్ కౌర్ గిల్ ఈ దాడిని ఖండించారు.