నవతెలంగాణ-హైదరాబాద్: కోల్కతా లా కాలేజీ విద్యార్థినిపై జరిగిన సామూహిక అత్యాచారానికి సంబంధించి ముగ్గురిని అరెస్ట్ చేశారు. నిందితులు మనోజిత్ మిశ్రా(30), ప్రమిత్ ముఖర్జీ (20), జైబ్ అహ్మద్(19)లను అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు శుక్రవారం తెలిపారు. వీరిలో ఒకరు పూర్వ విద్యార్థి కాగా, మరో ఇద్దరు ప్రస్తుతం అదే కాలేజీలో చదువుతున్నారు. నిందితులను నేడు కోర్టులో హాజరుపరచనున్నట్లు తెలిపారు.
బుధవారం (జూన్ 25) రాత్రి 7.30గంటల నుండి రాత్రి 10.50గంటల మధ్య కాలేజీ ఆవరణలో ఈ ఘటన జరిగింది. బాధితురాలికి కోల్కతా నేషనల్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆమె ఫిర్యాదు ఆధారంగా ముగ్గురు నిందితులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు తెలిపారు. ఇద్దరు నిందితులను గురువారం సాయంత్రం అరెస్ట్ చేయగా, మూడవ నిందితుడిని శుక్రవారం తెల్లవారుజామున అతని నివాసం నుండి అదుపులోకి తీసుకున్నామని అన్నారు. నిందితుల మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.