నవతెలంగాణ-హైదరాబాద్ : రాజస్థాన్లో ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లను తీసుకెళుతున్న ట్రక్కు, మరో ట్రక్కు ఢీకొన్నాయి. దీంతో మంటలు వ్యాపించి గ్యాస్ సిలిండర్లు పేలిపోయి ఆ ప్రాంతమంతా దద్దరిల్లింది. ఈ ఘటన జైపుర్-అజ్మేర్ జాతీయ రహదారిపై మంగళవారం అర్ధరాత్రి రాత్రి చోటుచేసుకుంది. ఈ ఘటనతో సమీపంలోని వాహనాలు సైతం దెబ్బతిన్నాయి. కొన్ని కిలోమీటర్ల మేర పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని సహాయ చర్యలు చేపట్టారు.
పేలుడు ఘటనతో రహదారిపై భారీ ట్రాఫిక్ జామ్ అయింది. ఈ ఘటనపై రాజస్థాన్ సీఎం భజన్లాల్ శర్మ ఆదేశాలతో డిప్యూటీ సీఎం ప్రేమ్చంద్ బైర్వా ఘటనాస్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. ఈ ఘటనలో రెండు ట్రక్కుల డ్రైవర్లు, క్లీనర్లు కనిపించడం లేదని ఆయన పేర్కొన్నారు. వారి జాడ కోసం పోలీసులు వెతుకుతున్నట్లు చెప్పారు. ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం చోటుచేసుకోలేదని ఉపముఖ్యమంత్రి పేర్కొన్నారు. అయితే భారీ పేలుళ్ల నేపథ్యంలో ముందుజాగ్రత్తగా సమీపంలోని ఓ ప్రభుత్వ ఆసుపత్రిని అధికారులు సిద్ధం చేశారు.