నవతెలంగాణ-హైదరాబాద్: పెరూ తాత్కాలిక అధ్యక్షుడు జోస్ మారియా బల్కాజర్.. మంగళవారం కొత్త ప్రధానిగా జనరల్ లూయిస్ ఎన్రిక్ అరోయోను నియమించారు. ప్రధానిగా ఉన్న డెనిస్ మిరాలెస్ మంగళవారం తన పదవికి రాజీనామా చేయడంతో అధ్యక్షుడు జోస్.. కొత్త ప్రధానిగా ఎన్రిక్ను నియమించారు. డెనిస్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మూడువారాలకే ఆమె రాజీనామా చేయడం గమనార్హం. ఆమె రాజీనామాతో అనూహ్యంగా కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం సంక్షోభంలో పడింది.
కాగా, కొత్తగా ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన అరియో.. మిరాలెస్ హయాంలో రక్షణ మంత్రిగా పనిచేశారు. కాంగ్రెస్ విశ్వాస తీర్మానానికి ఒకరోజు ముందు డెనిస్ మిరాలెస్ రాజీనామా చేయడంతో.. అధ్యక్షుడు జోస్ మారియా నియమించిన మరో 18 మంది పెరూ కేబినెట్ సభ్యులు కూడా తమ పదవుల నుంచి వైదొలగాల్సి వచ్చింది. అయితే మిరాలెన్ తన రాజీనామా గల కారణాలను వెల్లడించలేదు. తన రాజీనామాను ఆమోదించాలని అభ్యర్థిస్తున్నట్టుగా అధ్యక్షుడికి రాసిన లేఖలో ఆమె పేర్కొన్నారు. ఎన్నికల ప్రక్రియ పూర్తి పారదర్శతగా జరిగేలా దృష్టి సారించడమే ప్రస్తుత ప్రభుత్వ ధ్యేయమని అధ్యక్షుని కారాల్యయం విడుదల చేసిన ప్రకటన తెలిపింది.
పెరువియన్ చట్టం ప్రకారం.. అధ్యక్షుడిచే నియమించిన ప్రధాని, కేబినెట్ నాయకులు పదవి చేపట్టిన మొదటి నేలలోనే కాంగ్రెస్ విశ్వాస తీర్మానాన్ని పొందవలసి ఉంటుంది. ఒకవేళ ప్రధానిగా విశ్వాస ఓటులో నెగ్గకపోతే.. కేబినెట్ మంత్రులతో పాటు ప్రధాని కూడా రాజీనామా చేయాలి. అయితే ఇప్పుడు జరగబోయే విశ్వాస ఓటింగ్లో కచ్చితంగా మితవాద ప్రతిపక్షం గెలిచే అవకాశం ఉన్నందున మిరాలెన్ ఓటింగ్కు ముందే రాజీనామా చేసినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. ఇన్నాళ్లు ప్రధానిగా సేవలందించినందుకు డెనీస్ మిరాలెస్కి అధ్యక్ష భవనం కృతజ్ఞతలు తెలిపింది. ఈ మేరకు బల్కాజర్ కార్యాలయం సోషల్మీడియాలో విడుదల చేసిన ప్రకటన తెలిపింది.



