న్యూఢిల్లీ: దేశంలో ధాన్యం దిగుబడిని 30 శాతం పెంచాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం జన్యుపరంగా మార్పులు చేసిన రెండు వరి రకాలను అభివృద్ధి చేస్తోంది. కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ విషయాన్ని ప్రకటించారు. అయితే దేశంలో జన్యు మార్పిడికి సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిం చడంపై వివాదం కొనసాగుతోంది. పైగా దానిపై న్యాయస్థానాలలో కేసులు కూడా నడుస్తున్నాయి. అయినప్పటికీ కేంద్రం ఆ దిశగా అడుగులు వేయాలని నిర్ణయించడం గమనార్హం. జన్యుపరంగా మార్పులు చేసిన కమల రకంతో ఉత్పాదకత 30 శాతం, పూసా డీఎస్టీ రైస్ 1 రకంతో 20 శాతం పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇవి కరువు పరిస్థితులను తట్టుకుంటాయని, ముందుగానే కోతకు వస్తాయని, మీథేన్ను తక్కువ ఉత్పత్తి చేస్తాయని, నత్రజని అవసరం కూడా తక్కువేనని వారు అంటున్నారు. వ్యవసాయ రంగంలో జన్యు మార్పిడికి సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించవచ్చా లేదా అనే అంశం గత రెండు దశాబ్దాలుగా అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు పరిశీలనలో ఉంది. బయోసేఫ్టీ పరీక్షలో సానుకూల ఫలితాలు రాకుండానే దేశంలో ఈ పరిజ్ఞానాన్ని ఎందుకు అనుమతిస్తున్నారని ‘ది న్యూ ఇండియా ఎక్స్ప్రెస్’ పత్రిక ప్రతినిధి ప్రశ్నించినప్పుడు 1989వ సంవత్సరపు పర్యావరణ (పరిరక్షణ) చట్టంలోని జీవ భద్రతా నిబంధనల నుండి ఈ రెండు రకాలు మినహాయింపు పొందాయని చౌహాన్ బదులిచ్చారు. ‘ఉత్పాదకతను పెంచి, ఆశించిన ఫలితాలు సాధించడానికి స్థానిక పంట రకాల నుండి సజీవంగా ఉన్న జీవులను ఉపయోగించడమే జన్యు సాంకేతిక పరిజ్ఞానం. బ్యాక్టీరియాను చేర్చడం కంటే ఇది ఉత్తమమైన పద్ధతి. కాబట్టి దానికి నియంత్రణలు ఉండవు’ అని వివరించారు. కాగా ఈ కొత్త రకాలు రైతులను చేరుకోవడానికి నాలుగైదు సంవత్సరాల కంటే ఎక్కువ సమయమే పడుతుంది. ‘మేము ఇప్పుడు జాతిని అభివృద్ధి చేశాము. ఫౌండేషన్ విత్తనాలను అభివృద్ధి చేయడం, ధృవీకరణ పొందడం వంటి పనులకు కనీసం నాలుగైదు సంవత్సరాలు పడుతుంది’ అని చౌహాన్ చెప్పారు. ఈ రకాలు రైతులకు చేరిన తర్వాత వరి విస్తీర్ణాన్ని క్రమేపీ ఐదు మిలియన్ హెక్టార్లు తగ్గించి ఉత్పత్తిని పది మిలియన్ టన్నులు పెంచుతామని తెలిపారు. వరి పండించే విస్తీర్ణాన్ని తగ్గించి ఆ భూములలో రాబోయే సంవత్సరాలలో నూనె గింజలు, పప్పు ధాన్యాల పంటలు వేస్తామని, తద్వారా వాటిలో స్వయం సమృద్ధి సాధిస్తామని అన్నారు. అరటి, గోధుమ, ఆవాలు, పొగాకు, పత్తి, తేయాకు వంటి పంటలలో జన్యు మార్పిడి ప్రాజెక్టులు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. పొద్దుతిరుగుడు, సోయాబీన్, వేరుశనగ, శనగలు, మినుములు, కందులు వంటి చమురు గింజలు, పప్పు ధాన్యాల పంటల్లో కూడా జన్యుపరమైన మార్పులు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.