– గవర్నరును కోరిన మణిపూర్ బీజేపీ ఎమ్మెల్యేలు
ఇంఫాల్: ప్రస్తుతం రాష్ట్రపతి పాలనలో ఉన్న మణిపూర్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. రాష్ట్రానికి చెందిన పది మంది ఎమ్మెల్యేలు బుధవారం గవర్నర్ అజరు కుమార్ భల్లాతో సమావేశమయ్యారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు. గవర్నరును కలిసిన వారిలో ఎనిమిది మంది బీజేపీ ఎమ్మెల్యేలు, నేషనల్ పీపుల్స్ పార్టీకి చెందిన ఒకరు, ఓ స్వతంత్ర సభ్యుడు ఉన్నారు. తమకు 22 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నదని వారు గవర్నరుకు తెలిపారు. మణిపూర్ శాసనసభలో 60 మంది సభ్యులు ఉన్నారు. గవర్నరును కలిసిన అనంతరం బీజేపీ ఎమ్మెల్యే తోక్చమ్ రాధేశ్యామ్ విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు 44 మంది శాసనసభ్యులు సిద్ధంగా ఉన్నారని చెప్పారు.
‘మా సంతకాలతో కూడిన పత్రాన్ని గవర్నరుకు అందజేశాం. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఎన్డీఏ ఎమ్మెల్యేలు అందరూ సిద్ధంగా ఉన్నారు. మాకు ప్రజల మద్దతు కూడా కావాల్సి ఉంది. పత్రంపై 22 మంది సంతకాలు చేశారు. గవర్నరును కలవడానికి పది మంది ఎమ్మెల్యేలం వచ్చాము’ అని స్వతంత్ర సభ్యుడు సపమ్ నిషికాంత్ సింగ్ తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ రాజీనామా కారణంగా మణిపూర్లో ఫిబ్రవరి 13వ తేదీ నుండి రాష్ట్రపతి పాలన అమలులో ఉంది. మణిపూర్ శాసనసభలో బీజేపీకి 37 స్థానాలు ఉన్నాయి. మెజారిటీకి అవసరమైన 31 స్థానాల కంటే ఆ పార్టీకి ఆరు స్థానాలు అదనంగానే ఉన్నాయి. బీజేపీ ఎమ్మెల్యేలలో 27 మంది మైతీలు కాగా ఆరుగురు కుకీలు. ముగ్గురు నాగాలు, ఒక ముస్లిం కూడా ఉన్నారు. ఐదుగురు సభ్యులున్న నేషనల్ ఫీపుల్స్ ఫ్రంట్ కూడా ఎన్డీఏలో భాగస్వామిగా ఉంది.
ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వండి
- Advertisement -
- Advertisement -