– చంద్రబాబు అడుగులకు మడుగులొత్తుతున్నారు
– అబద్ధాల్లో సీఎంను మించిన ఉత్తమ్ : మాజీ మంత్రి హరీశ్రావు
నవతెలంగాణ-దుబ్బాక
”తెలంగాణ నుంచి 400 టీఎంసీల గోదావరి జలాలను ఏపీకి అక్రమంగా తరలిస్తుంటే ప్రభుత్వం గుడ్లప్పగించుకుని చూస్తుందా.. వాటిని ఆపే సత్తా రాష్ట్ర ప్రభుత్వానికి లేదా..” అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు ప్రశ్నించారు. దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్లాలన్న సోయి కూడా ఈ ప్రభుత్వానికి లేదని, కేంద్ర మంత్రులను కలవరని, నిటిఆయోగ్లో సీఎం మాట్లాడడని అన్నారు. ఈ సర్కార్ ఏపీ నీటి దోపిడీని అడ్డుకోకపోగా.. చంద్రబాబు అడుగులకు మడుగులొత్తుతోందని విమర్శించారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణ కేంద్రంలో ని కేపీఆర్ క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఫారుక్ హుస్సేన్తో కలిసి హరీశ్రావు మాట్లాడారు. గంధ మల్ల ప్రాజెక్టు కాళేశ్వరంలో అంతర్భాగ మని, కాళేశ్వరం కూలితే గంధమల్లకు గోదావరి జలాలు ఎట్లా వస్తాయని ప్రశ్నించారు. అపెక్స్ కమిటీ, అంతర్రాష్ట్ర అనుమతి, గోదావరి ట్రిబ్యునల్ అనుమతి లేకుండా ప్రాజెక్టు కడుతుంటే నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి ఎందుకు మౌనంగా ఉన్నారో సమాధానం చెప్పాలన్నారు. చంద్రబాబును ఎదిరించే దమ్ము, సుప్రీంకో ర్టుకు వెళ్లే సత్తా రాష్ట్ర సర్కార్కు లేవని తెలిపారు. రాష్ట్ర చరిత్రలోనే తాత్కాలిక కేటాయింపుల ప్రకారం 65 టీఎంసీలు తక్కువ వాడిన మొట్టమొదటి చేతగాని ప్రభుత్వం రేవంత్ రెడ్డిదేనని, ఆరున్నర లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వకపోవడం వల్ల పంటలన్నీ ఎండిపోయాయని అన్నారు. బనకచర్ల ప్రాజెక్టుపై కేబినెట్లో మాట్లాడేందుకు సమయం దొరకలేదా అని, కేవలం వారి కమీషన్లు, పర్సెంటేజీలు, హై కమాండ్కు పంపే మూటల గురించే ఐదు గంటల సమయాన్ని వెచ్చించారని ఆరోపించారు. వీటిపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించకుంటే సుప్రీంకోర్టుకు బీఆర్ఎస్ వెళ్తుందన్న మాటకి కట్టుబడి ఉంటామని తెలిపారు. బనకచర్లతో తెలంగాణ రాష్ట్రం గోదావరిలో వాటా కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుందని, ఆ పనుల్ని బీఆర్ఎస్ ప్రభుత్వం నిలిపివేస్తే, కాంగ్రెస్ సర్కార్ వచ్చాక మొదలుపెట్టిందని అన్నారు. తక్షణమే ఆ పనులను ఆపివేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రానికి ఇంతగా అన్యాయం జరుగుతుంటే ఇక్కడి కేంద్ర మంత్రులు, బీజేపీ ఎంపీలు ఎందుకు మాట్లాడటం లేదో సమాధానం చెప్పాలన్నారు.
ప్రజలను నిరాశ పరిచేలా కేబినెట్ నిర్ణయాలు
ప్రభుత్వం ఉద్యోగులను, రాష్ట్ర ప్రజలను నిరాశ పరిచేలా కేబినెట్ నిర్ణయాలు ఉన్నాయని హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ఓపిఎస్ను అమలు చేసి పెండింగ్ డీఏలను క్లియర్ చేయాలని డిమాండ్ చేశారు. ఐదు డీఏలు పెండింగ్లో ఉన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని, ఉద్యోగులను రాచి రంపాన పెడుతూ వారిని నిట్టనిలువునా ముంచుతున్నారని అన్నారు. రేవంత్ సర్కార్ తక్షణమే మూడు డీఏలు చెల్లించాలని డిమాండ్ చేశారు. పంచాయతీలకు నిధులు ఇవ్వకుండా కార్యదర్శులను ఇబ్బంది పెడుతుందని, పంచాయతీ నిర్వాహణ భారమై అప్పుల పాలయ్యారని, తెలంగాణలో అప్పు లేని పంచాయతీ సెక్రెటరీ లేని పరిస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ మాజీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
గోదావరి జలాలను ఏపీకి తరలిస్తున్నారు ఆపే సత్తా లేదా..?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES