– వృద్ధ దంపతులను మోసం చేసిన దొంగలు
నవతెలంగాణ-భైంసా
వృద్ధ దంపతులను బురిడీ కొట్టించి, బంగారం అపహరించిన సంఘటన మంగళవారం నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో జరిగింది. బాధితులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కుంటాల మండలంలోని అంబకంటి గ్రామానికి చెందిన వృద్ధ దంపతులు రాజవ్వ, గోవింద్ను ముగ్గురు ఆగంతకులు బురిడీ కొట్టించి రెండు తులాల బంగారు చైన్ను అపహరించుకుపోయారు. వారు తమ సమీప బంధువుల ఇంట్లో జరుగుతున్న శుభకార్యాయానికి మంగళవారం మధ్యాహ్నం భైంసాకు వచ్చారు. స్థానిక పిప్రి కాలనీ బస్టాండ్ వద్ద బస్సు దిగి నడుచుకుంటూ వెళ్తుండగా.. ద్విచక్ర వాహనంపై కాపు కాచి ఉన్న ముగ్గురు ఆగంతకులు వృద్ధ జంటను ఆపి తాము అధికారులమంటూ మాట్లాడారు. చోరీలు అధికమైన దృష్ట్యా బంగారు చైన్ను మెడలో నుంచి తీసివేసి లోపల పెట్టుకోవాలంటూ సూచించారు. దాంతో రాజవ్వ తన బంగారు చైన్ను మెడలో నుంచి తీయగా.. ఆగంతకుడొకడు పేపర్ పొట్లంలో పెట్టి ఇస్తానని నమ్మించి తీసుకున్నాడు. అదే సమయంలో మరో వ్యక్తి వారిని మాటల్లో పెట్టగా.. ఇంకొకడు బంగారు చైన్ను దాచిపెట్టి ముందుగాను తాను సిద్ధం చేసి ఉంచుకున్న మట్టి పెళ్లలు చుట్టిన పేపర్ కవర్ను వృద్ధులకు ఇచ్చి సంచిలో వేసుకోవాలని సూచించారు. వృద్ధురాలు వారు ఇచ్చి మట్టి పేపర్ కవరును సంచిలో వేసుకొని నడుచుకుంటూ బంధువుల ఇంటి వైపు వెళ్లింది. ఆ తర్వాత ఆగంతకులు బైక్పై అక్కడి నుంచి ఉడాయించారు. కొద్ది దూరం వెళ్లిన అనంతరం గోవింద్ పేపర్ పొట్లం తీసి బంగారు చైన్ వేసుకోవాల్సిందిగా భార్య రాజవ్వకు సూచించాడు. దాంతో ఆమె పొట్లం విప్పి చూడగా అందులో మట్టి, చిన్నపాటి కంకర కనిపించడంతో కంగుతిని తాము మోసపోయినట్టు గుర్తించి లబోదిబోమన్నారు. రోదిస్తూ వెళ్లి బంధువులకు చెప్పారు. సమాచారం అందుకున్న పట్టణ పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని వృద్ధ దంపతుల నుంచి వివరాలు సేకరించారు. ఆగంతకుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
బురిడీ కొట్టించి.. బంగారం అపహరణ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES