నవతెలంగాణ-హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సర్కారు శుభవార్త చెప్పింది. సంవత్సరంలో 30 రోజులు అదనంగా సెలవులు తీసుకోవచ్చని చెప్పింది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి డాక్ట్ జితేంద్ర సింగ్ రాజ్యసభలో ప్రకటించారు. ఉద్యోగులు ఆయా సెలవులను తమ వ్యక్తిగత అవసరాలకు ఉపయోగించుకోవచ్చన్నారు. ఇందులో 20 రోజుల హాఫ్ పే లీవ్, ఎనిమిది రోజుల క్యాజువల్ లీవ్, 2 రోజుల పరిమిత సెలవులు ఉన్నాయి. రాజ్యసభలో ఎంపీ సుమిత్రా బాల్మిక్ అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. కేంద్ర సహాయమంత్రి జితేంద్ర సింగ్ సమాధానం ఇచ్చారు. సర్వీస్ రూల్స్ ప్రకారం.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు 30 రోజులు సెలవు తీసుకునేందుకు అర్హులని.. ఈ సెలవులను వృద్ధ తల్లిదండ్రులను చూసుకునేందుకు, ఇతర వ్యక్తిగత అవసరాల కోసం ఉపయోగించవచ్చన్నారు.
ప్రభుత్వ ఉద్యోగులు తమ వృద్ధ తల్లిదండ్రులను చూసుకునేందుకు.. ఈ కారణంతో సెలవు తీసుకునేందుకు ఏమైనా అవకాశాలున్నాయా? అని ఎంపీ సుమిత్రా బాల్మిక్ అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు. సెంట్రల్ సివిల్ సర్వీసెస్ నిబంధనలు, 1972 ప్రకారం.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగికి 30 రోజుల సెలవుల్లో 20 రోజులు హాఫ్ పే లీవ్స్, 8 రోజుల క్యాజువల్ లీవ్స్, 2 రోజుల పరిమిత సెలవులతో పాటు ఇతర అర్హత గల సెలవులు ఉంటాయి. ఆయా సెలవులను ఉద్యోగులు తమ వృద్ధ తల్లిదండ్రులను చూసుకోవడం తదితర వ్యక్తిగత కారణాల కోసం తీసుకోవచ్చని కేంద్రమంత్రి తెలిపారు. సదరు ఉద్యోగి సెలవులు ఎందుకు పెట్టారని అడిగితే వృద్ధులైన తల్లిదండ్రులను చూసుకునేందుకని స్పష్టంగా పేర్కొనవచ్చు. అయితే, ఇవేమీ కొత్తగా ఇచ్చే సెలవులేమి కాకపోయినా.. వృద్ధ తల్లిదండ్రులను చూసుకునేందుకు సైతం సెలవులు తీసుకునే అవకాశం ఉందని చెప్పడం కొత్త విషయం.