నవతెలంగాణ-హైదరాబాద్: గ్రూప్-2 అభ్యర్థులకు తెలంగాణ సర్కార్ తీపి కబురు చెప్పింది. ఈనెల 18న ఉద్యోగాలు పొందిన వారికి స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి నియామక పత్రాలు అందజేయనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ కె. రామకృష్ణారావు వెల్లడించారు. నగరంలోని శిల్పకళా వేదిక కార్యక్రమం ఏర్పాటు చేయనున్నారు. మంగళవారం
ఈ కార్యక్రమం ఏర్పాట్లపై సంబంధిత ఉన్నతాధికారులతో డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో మంగళవారం సి.ఎస్. సమీక్షా సమావేశం నిర్వహించారు.
గ్రూప్-2 ద్వారా ఎంపికైన 783 మంది అభ్యర్థులకు రాష్ట్ర ముఖ్యమంత్రి నియామక పత్రాలు అందిస్తారని తెలిపారు. వీరిలో దాదాపు 16 శాఖలకు చెందిన అభ్యర్థులు ఉన్నారని. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులందరినీ ఆహ్వానిస్తున్నట్లు సి.ఎస్ తెలిపారు. ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన కార్యక్రమం త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమానికి అభ్యర్థితో పాటు వారి కుటుంబ సభ్యులను సాయంత్రం 4 గంటల లోపు శిల్పకళా వేదికలో అనుమతించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.
ఈ నియామకాల్లో అత్యధికంగా, సాధారణ పరిపాలన, రెవిన్యూ, వాణిజ్య పన్నుల శాఖ, ఎక్సైజ్ శాఖ, పంచాయతీరాజ్ శాఖలకు చెందిన వారే అధికంగా ఉన్నందున, రెవిన్యూ, హోం, జిఎడి కార్యదర్శులు ఈ కార్యక్రమ నిర్వహణలో సమన్వయంతో ఏర్పాట్లు పూర్తి చేయాలని సి.ఎస్. ఆదేశించారు. నియామక పత్రాలు పొందే అభ్యర్థులు రాబోయే 30 సంవత్సరాలలో సర్వీస్ లో ఉంటారు కాబట్టి, వీరికి ప్రభుత్వ సర్వీస్ పట్ల ఉన్నత భావన కలిగేలా కార్యక్రమాన్ని నిర్వహించాలని అందుకు తగు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.