నవతెలంగాణ-హైదరాబాద్ : రోడ్డు ప్రమాద బాధితులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలియ జేసింది. ప్రమాదం జరిగిన వారంలోపు రూ.1.5 లక్షల వరకు ఉచిత చికిత్స అందిస్తామని ప్రకటించింది. ఈ మేరకు నేడు రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ రోడ్డు ప్రమాద బాధితులకు నగదు రహిత చికిత్స అమలుపై హైదరాబాద్ లో సమీక్షా సమావేశం నిర్వహించారు. రోడ్డు ప్రమాద క్షతగాత్రులకు నగదు రహిత చికిత్స అమలు సాధ్యాసాధ్యాలపై అధికారులతో పొన్నం ప్రభాకర్ చర్చించి, పలు కీలక నిర్ణయాలు ప్రకటించారు. రోడ్డు ప్రమాదం జరిగిన బాధితులకు వారంలోపు వారికి అయ్యే చికిత్సా ఖర్చు రూ.1.5 లక్షల వరకు ప్రభుత్వం భరిస్తుందని వెల్లడించారు.
ప్రమాదం జరిగిన సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు స్పందించాలని, ప్రమాద వివరాలు, క్షతగాత్రుల వివరాలు ఈ-దార్ లో నమోదు చేయాలని అన్నారు. ఈ వివరాల ఆధారంగా వారి చికిత్స ఖర్చు ప్రభుత్వం భరిస్తుందని తెలిపారు. అయితే ఆయుష్మాన్ భారత్ కింద నమోదైన ఆసుపత్రుల్లో మాత్రమే ఈ పథకం వర్తిస్తుందని తెలిపిన పొన్నం.. రోడ్డు ప్రమాద బాధితులకు చికిత్సపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.