– క్రికెట్ సలహా కమిటీ చైర్మెన్గా ప్రజ్ఞాన్ ఓజా
– హెచ్సీఏ వార్షిక సర్వ సభ్య సమావేశంలో నిర్ణయం
నవతెలంగాణ-హైదరాబాద్ :
తెలంగాణ టీ20 ప్రీమియర్ లీగ్ (టీపీఎల్) నిర్వహణకు ఐదుగురు సభ్యులతో గవర్నింగ్ కౌన్సిల్ను ఏర్పాటు చేయాలని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) 87వ వార్షిక సర్వ సభ్య సమావేశం (ఏజీఎం)లో తీర్మానించారు. ఈ ఏడాది సెప్టెంబర్/అక్టోబర్లో ఆరంభం కానున్న టీపీఎల్కు మార్గదర్శకాలు, లీగ్ ఫార్మాట్ తదితర అంశాలను గవర్నింగ్ కౌన్సిల్ తేల్చుతుంది. క్రికెట్ సలహా కమిటీ చైర్మెన్గా ప్రజ్ఞాన్ ఓజా పేరును సభ్యులు ఏకగ్రీవంగా ప్రతిపాదించగా, ఆయనను సీఏసీగా నియమించటం లాంఛనమే. అంబుడ్స్మన్, ఎథిక్స్ ఆఫీసర్గా సభ్యులు ఐదుగురు విశ్రాంత న్యాయమూర్తుల పేర్లను సూచించగా.. అపెక్స్ కౌన్సిల్ తుది నిర్ణయం తీసుకోనుంది. హెచ్సీఏ లీగ్ టోర్నమెంట్ల నిర్వహణను అసోసియేషన్ లీగ్ కమిటీ పర్యవేక్షించాలని అనుకున్నారు. అపెక్స్ కౌన్సిల్లో ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుల సంఖ్యను పెంచేందుకు రాజ్యాంగ కమిటీని ఏర్పాటు చేశారు. మాజీ క్రికెటర్లు, మాజీ అధ్యక్షులు శివలాల్ యాదవ్, అర్షద్ ఆయూబ్లు ఈ కమిటీకి సలహాదారులుగా వ్యవహరించనున్నారు. జిల్లాల్లో క్రికెట్ అభివృద్దికి ఓ కమిటీ ఏర్పాటు చేయగా.. హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు ‘డిస్ట్రిక్స్ క్రికెట్ డెవలప్మెంట్ కమిటీ’కి చైర్మెన్గా ఉండనున్నారు. ప్రతి జిల్లాలో క్రికెట్ స్టేడియం నిర్మాణం చేపట్టాలని, అందుకు ప్రతి చోట 25 ఎకరాల భూమిని తక్కువ ధరకు ప్రభుత్వం నుంచి పొందేందుకు అసోసియేషన్ సభ్యులు, ప్రజా ప్రతినిధులు చామల కిరణ్ కిరణ్కుమార్ రెడ్డి, రఘువీర్ రెడ్డి సహా వి హనుమంతరావు కృషి చేయాలని ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సభ్యులు చాముండేశ్వర్నాథ్ కోరారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితో చర్చించేందుకు హెచ్సీఏ బృందాన్ని తీసుకెళ్లాలని సూచించారు. హెచ్సీఏలో అంతర్గత విభేదాల వార్తల నేపథ్యంలో ఏజీఎం ఎటువంటి వివాదాలకు తావులేకుండా.. ప్రశాంతంగా ముగియటం విశేషం. హెచ్సీఏ ఆఫీస్ బేరర్లు జగన్మోహన్ రావు, దేవరాజ్, దల్జీత్ సింగ్, బసవరాజు, శ్రీనివాసరావు, సునీల్ అగర్వాల్ సహా మాజీ ఆఫీస్ బేరర్లు శివలాల్ యాదవ్, అర్షద్ ఆయూబ్, మహ్మద్ అజహరుద్దీన్, విజయానంద్, శేషు నారాయణ, శ్రీధర్, జాన్మనోజ్, క్లబ్ కార్యదర్శులు ఏజీఎంలో పాల్గొన్నారు.
టీపీఎల్కు గవర్నింగ్ కౌన్సిల్ ఏర్పాటు!
- Advertisement -
- Advertisement -