Thursday, September 25, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రభుత్వం మక్క కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించాలి

ప్రభుత్వం మక్క కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించాలి

- Advertisement -

– మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి
– కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయక నష్టపోతున్న రైతులు
– రైతు డిక్లరేషన్ లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అన్ని నెరవేర్చాలి
నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
ప్రభుత్వం మక్క కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం వల్ల రైతులు ఎకరానికి రూ.30వేలు  నష్టపోతున్నారన్నారు. ప్రభుత్వమే మద్దతు ధరకు అదనంగా బోనస్ ఇచ్చి క్వింటలకు రూ.2800 ఇచ్చి మక్క కొనాలన్నారు.రైతు డిక్లరేషన్ లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అన్ని నెరవేర్చాలని డిమాండ్ చేశారు. గురువారం వేల్పూర్ మండల కేంద్రంలోని తన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో మొక్కజొన్న రైతులు పడుతున్నటువంటి కష్టాలను తీర్చేటటువంటి బాధ్యత రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వానిదే అన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా, నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో మొక్కజొన్న పంట చేతికొచ్చిందని, దాదాపు 60 శాతం పంట కోతలు పూర్తయ్యాయన్నారు. రైతులు కష్టపడి పండించి మొక్కజొన్న పంటను ప్రైవేట్ వ్యాపారులు క్వింటాలుకు రూ.1800 లకు కూడా కొనడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేట్ వ్యాపారులు రూ.2వేలకు మొదట కొని తర్వాత తగ్గిస్తూ ఇప్పుడు రూ.1800 కూడా కొనడం లేదని, దీనివల్ల రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రైవేట్  వ్యాపారులు ధర ఇంకా తగ్గించి రూ.1600 లకు కొనే పరిస్థితి వస్తుందని తెలిపారు. వర్షాలు పడుతున్నందున చేతికొచ్చిన మొక్కజొన్న పంటను రైతులు నిలువ చేసుకునే పరిస్థితి లేక, తడిచిపోయే ప్రమాదం ఉండటంతో  రైతులు పంటను దిక్కులేక దళారులకు అమ్మే పరిస్థితి వచ్చిందన్నారు.

దీన్ని ఆసరాగా చేసుకొని ప్రైవేట్ వ్యాపారులు తక్కువ ధరకు రైతుల దగ్గర మొక్కజొన్న పంటను కొనుగోలు చేస్తున్నారని పేర్కొన్నారు. రైతులను మోసం చేస్తున్న ప్రైవేట్ వ్యాపారులకు చెక్ పెట్టాలంటే  ప్రభుత్వం వెంటనే ముందుకు వచ్చి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.ప్రభుత్వం మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల ఏర్పాటు ఆలస్యం చేయడం వల్ల ప్రైవేట్ వ్యాపారులు తక్కువ ధరకు రైతుల దగ్గర పంటను కొనుగోలు చేయడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు.

రైతు డిక్లరేషన్ లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చాలి….

 కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో వరంగల్ రైతు డిక్లరేషన్ పేరిట అన్ని పంటలను మెరుగైన మద్దతు ధరతో కాంగ్రెస్ పార్టీ కొనుగోలు చేస్తుందని హామీ ఇచ్చిందని, రైతు డిక్లరేషన్ లో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేశారు.ప్రైవేట్ వ్యాపారుల చేతిలో రైతులు తీవ్రంగా నష్టపోతున్న ప్రస్తుత పరిస్థితులలో ప్రభుత్వం మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు వెంటనే ఏర్పాటు చేసి ప్రస్తుతం రూ.2400 మద్దతు ధర ఉన్న మొక్కజొన్న పంటను మెరుగైన మద్దతు ధర రూ. 400 కలిపి రూ.2800 కొనుగోలు చేయాలని కాంగ్రెస్ పార్టీని  డిమాండ్ చేస్తున్నామన్నారు.

కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం రూ.2800 లకు మక్క పంట కొనాలనీ, కానీ ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయక  పోవడం వల్ల ప్రస్తుతం ప్రైవేట్ వ్యాపారులు ఇస్తున్న ధరతో  రైతు ఎకరానికి రూ.1000  నష్టపోతున్నాడన్నారు.ప్రతి  ఎకరానికి 30 క్వింటాల పంట వచ్చిన ఎకరానికి రూ.30వేలు మక్క పండించే రైతు నష్టపోతున్నాడని తెలిపారు.ఈ ప్రభుత్వం యొక్క అలసత్వం వల్ల, ఈ ప్రభుత్వంకు రైతులు అంటే లెక్కలేని తనం వల్ల ఇవాళ మక్క పండించే రైతులు ఇబ్బంది పడుతున్నారన్నారు. వర్షాలు పడుతున్నందున పంట తడిచిపోయే ప్రమాదం ఉన్నందున రైతులు దిక్కులేక ప్రవేట్ వ్యాపరులకు అమ్ముకుంటున్నారని తెలిపారు.

కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామ గ్రామాన మక్క కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతుల నుండి పంట వెంటనే కొనుగోలు చేయాలనీ రేవంత్ రెడ్డిని, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు ను డిమాండ్ చేస్తున్నామన్నారు. రూ.2400 మద్ధతు ధరకు కాంగ్రెస్ ఇచ్చిన హామీ ప్రకారం రూ.400 కలిపి రూ.2800 లకు పంటను కొనుగోలు చేయాలనీ డిమాండ్ చేశారు.

గతంలో కేసీఆర్ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులను ఆదుకున్నారన్నారు.కాంగ్రెస్ పార్టీ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోతే రైతులను కూడదీసి బిఆర్ఎస్ పార్టీ పక్షాన ప్రభుత్వంపై పోరాడాల్సి వస్తుందని హెచ్చరించారు. సోయా పంట కూడా చేతికోస్తుందని, ప్రభుత్వం ఇప్పటినుండే పంట కొనుగోలు చేయడానికి ప్రణాళికలు చేసుకోవాలని సూచించారు.ప్రభుత్వం జిల్లా కలెక్టర్ లకు, వ్యవసాయ అధికారులకు సూచనలు చేయాలన్నారు. మొక్కజొన్న పంట కొనుగోలుకు ఏర్పడిన పరిస్థితులు సొయా పంటకు రాకుండా ప్రభుత్వం ముందే జాగ్రత్తలు తీసుకోవాలని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -