Monday, June 16, 2025
E-PAPER
Homeతాజా వార్తలుస్థానిక సమరంపై సర్కారు కసరత్తు

స్థానిక సమరంపై సర్కారు కసరత్తు

- Advertisement -

– జులై లేదా ఆగస్టులో?
– నేడు మంత్రులతో సీఎం ప్రత్యేక సమావేశం
– మొదట ఎంపీటీసీ, జెడ్పీటీసీ..తర్వాతనే సర్పంచ్‌ ఎన్నికలు
– రెండు దశల్లోనే పూర్తిచేసే యోచన బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కష్టమే
– పార్టీగా ఆ సంఖ్యలో బీసీ అభ్యర్థులను నిలిపే యోచనలో కాంగ్రెస్‌
– బీజేపీ కోర్టులోకి రిజర్వేషన్‌ బంతి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

స్థానిక సంస్థల పోరుకు కాంగ్రెస్‌ సర్కారు సన్నద్ధమవుతున్నది. జులై చివర్లోగానీ, ఆగస్టు మొదట్లోగానీ నోటిఫికేషన్‌ వెలువడే అవకాశాలున్నట్టు ప్రభుత్వ వర్గాల నుంచి లీకులు బయటకు వస్తున్నాయి. మొదట ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించబోతున్నట్టు ప్రచారం జరుగుతున్నది. ఆ తర్వాతనే సర్పంచ్‌ ఎన్నికలు నిర్వహించే అవకాశాలున్నాయి. సాధారణంగా జులై వ్యవసాయ పనుల సీజన్‌. రైతులంతా ఆ పనుల్లో బిజీగా ఉంటారు కాబట్టి ఒకటెండ్రు నెలలు సాగదీస్తే ఎలా ఉంటుందనే చర్చను కూడా కాంగ్రెస్‌లోని కొందరు లేవనెత్తుతున్నారు. అయినా, ముందుకే వెళ్లాలని సీఎం సహా పలువురు కీలక మంత్రులు అభిప్రాయానికి వచ్చినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలోనే సోమవారం హైదరాబాద్‌లో మంత్రులతో సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. అందులో ప్రధానంగా స్థానిక సంస్థలు, ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా, రాజీవ్‌ యువ వికాసం, ఇతర సంక్షేమ పథకాలపైనా చర్చించే అవకాశముంది. అయితే, ప్రధానంగా స్థానిక పోరుపైనే చర్చ నడిచే సూచనలున్నాయి. ప్రభుత్వ నిర్ణయం తర్వాత కొద్ది రోజుల్లోనే ఎన్నికల సంఘం నుంచి నోటిఫికేషన్‌ వెలువడే అవకాశాలున్నాయి. గతంలో సాధారణంగా మూడు విడతల్లో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించేవారు. కానీ, ఈసారి మాత్రం రెండు విడతల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించ బోతున్నట్టు తెలుస్తోంది. రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వ హయాంలోనూ తొలుత జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను నిర్వహించారు. అదే పద్ధతిని ఈసారి అమలు చేసేలా కాంగ్రెస్‌ సర్కారు కసరత్తు చేస్తున్నది. మొదట ఈ ఎన్నికలు నిర్వహిస్తే పార్టీకి మేలు జరుగుతుందని కాంగ్రెస్‌ అధిష్టానం యోచిస్తున్నది. అందులో భాగంగానే ప్రజల మూడ్‌ను పసిగట్టేందుకు మంత్రులు కూడా అక్కడక్కడా స్థానిక పోరుపై ప్రస్తావిస్తున్నారు. స్థానిక ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల చేసే నాటికి రైతు భరోసా నిధులను విడుదల చేయాలనే యోచనలో రాష్ట్ర సర్కారు ఉంది. అదే సమయంలో కాంగ్రెస్‌ సర్కారు చేస్తున్న పనులను ప్రజలకు విడమర్చి చెప్పేందుకు ప్రజల్లోనే ఎమ్మెల్యేలు, మంత్రులుం టున్నారు. మంత్రులు కూడా తమ ప్రోగ్రెస్‌ రిపోర్టులను విడుదల చేస్తున్నారు.
42 శాతం చట్టబద్ధంగా కష్టమే..పార్టీగా ఇచ్చేందుకు మొగ్గు
అయితే, బీసీలకు ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు అమలు కష్టమేననే అభిప్రాయానికి రాష్ట్ర సర్కారు వచ్చినట్టు తెలిసింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని కోరుతూ రాష్ట్ర సర్కారు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రం కోర్టులోకి బంతి విసిరింది. దేశవ్యాప్తంగా జనగణనతో పాటు కులగణనను కూడా చేస్తామని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. 42 శాతం రిజర్వేషన్లు అమలు కావాలంటే అది చట్టరూపం దాల్చాల్సిందే. ఇప్పట్లో అది సాధ్యమయ్యేటట్టు లేదు. కాంగ్రెస్‌ పార్టీ జిల్లాల ప్రాతిపదికన 42 శాతం మంది బీసీ అభ్యర్థులకు జెడ్పీటీసీ, ఎంపీటీల స్థానాలను ఇవ్వాలని భావిస్తున్నది. అదే సమయంలో బీజేపీ వల్లనే స్థానిక సంస్థల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్లు ఇవ్వలేకపోయామనే వాణిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే ఆలోచనలో రాష్ట్ర సర్కారు ఉంది.
కేంద్రం నుంచి నిధులు ఆగటంతోనే..
ప్రస్తుతం రాష్ట్రంలో స్థానిక ప్రజాప్రతినిధులు లేరు. ఇటు పట్టణాల్లోనూ, అటు పల్లెలోనూ ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతున్నది. పాలకమండళ్లు లేవనే సాకుతో 15వ ఆర్థిక సంఘం నిధులను విడుదల చేయడం ఆపేసింది. ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచీ కూడా సరిగా నిధులు అందని పరిస్థితి. దీంతో గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు, ప్రత్యేక అధికారులు తమ చేతుల్లోంచి డబ్బులు పెట్టి అభివృద్ధి పనులు చేయిస్తున్న పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల్లో పాలన పడకేసింది. మరోవైపు బీఆర్‌ఎస్‌ పాలనలో స్థానిక సంస్థల ఎన్నికలు క్రమం తప్పకుండా నిర్వహించారనే పేరుంది. ఈ విషయంపై ఇప్పటికే కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విమర్శల దాడిని ఎక్కుపెట్టాయి. ఇది ఇంకా సాగదీస్తే బాగుండదనే ఆలోచనలో కాంగ్రెస్‌ అధిష్టానం ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -