Monday, June 23, 2025
E-PAPER
Homeతాజా వార్తలుఉపాధి నిధులతో జీపీ, అంగన్‌వాడీ భవనాలు

ఉపాధి నిధులతో జీపీ, అంగన్‌వాడీ భవనాలు

- Advertisement -

– తొలి విడతలో 1148 అంగన్‌వాడీల నిర్మాణం
– ఇప్పటికే 813 చోట్ల స్థలాల గుర్తింపు
– ఒక్కో జీపీ కార్యాలయానికి రూ.20 లక్షలు,
– అంగన్‌వాడీ కేంద్రానికి రూ.12 లక్షలు…
– అందులో ఉపాధి నిధులు రూ.8 లక్షలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

ప్రతి మండలానికి రెండు గ్రామ పంచాయతీ భవనాలు, మరో రెండు అంగన్వాడీ భవనాల చొప్పున నిర్మించాలని టార్గెట్‌ పెట్టుకున్న తెలంగాణ పంచాయతీ రాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ ఆ దిశగా ముందుకెళ్తున్నది. అందులో గ్రామపంచాయతీ కార్యాలయాలను పూర్తిగా ఉపాధి నిధులతోనే నిర్మించనున్నది. అంగన్‌వాడీ కేంద్రానికి రూ.12 లక్షలు (అందులో ఉపాధి నిధులు రూ.8 లక్షలుకాగా, 15వ ఆర్థిక సంఘం నుంచి రూ.2 లక్షలు, మహిళా శిశు, సంక్షేమ శాఖ నుంచి రూ.2 లక్షలు) వెచ్చించనున్నది. గతేడాది నవంబర్‌లో టార్గెట్‌ పెట్టుకోగా స్థలాల గుర్తింపు, అప్పగింతలో జాప్యం కారణంగా అనుకున్న స్థాయిలో భవనాల నిర్మాణాలు పూర్తి కాలేదు. ఆ అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఈ ఆర్దిక సంవత్సరం ప్రారంభం నుంచే జీపీ భవనాలు, అంగన్వాడీ కేంద్రాలపై ప్రభుత్వం ఫోకస్‌ పెట్టింది. ఈ విషయంలో మంత్రి సీతక్క ప్రత్యేక శ్రద్ద పెడుతున్నారు. భవన నిర్మాణాల కోసం స్థలాలు సేకరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేయడమే కాకుండా ఎప్పటి కప్పుడు పంచాయతీ రాజ్‌ కమిషనరేట్‌ అధికారులు, జిల్లా డీఆర్డీఏలతో సమీక్షలు నిర్వహిస్తూ వస్తున్నారు. దీంతో మొదటి త్రైమాసికంలోనే స్థలాలను గణనీయంగా గుర్తించారు. మొత్తం ఈ ఏడాది 1148 అంగన్వాడీ భవనాల నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యం పెట్టుకోగా…ఇప్పటికే 813 అంగన్వాడీ భవనాల నిర్మాణం కోసం స్థలాలను గుర్తించారు. మరో 98 చోట్ల స్థలాలను గుర్తించాల్సి ఉంది. కొన్నింటికి సంబంధించి గతంలో భవనాల నిర్మాణం మొదలుపెట్టగా నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి.
ఈ ఆర్దిక సంవత్సరంలో ప్రతి మండలానికి రెండు చొప్పున మొత్తం 1144 గ్రామపంచాయతీ కార్యాలయాలను పూర్తిచేయాలని రాష్ట్ర సర్కారు టార్గెట్‌ పెట్టుకున్నది. మొదటి త్రైమాసికం ముగియక ముందే 549 గ్రామాల్లో స్థలాలను గుర్తించారు. 84 చోట్ల ఇంకా స్థలాలను గుర్తించాల్సి ఉంది. మిగిలిన గ్రామాల్లో జీపీ భవనాల నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి. రాజధాని చుట్టూ ఉన్న యాదాద్రి భువనగిరి, వికారాబాద్‌, సంగారెడ్డి జిల్లాలతో పాటు ఏజెన్సీలోని ఆదిలాబాద్‌, నిర్మల్‌ జిల్లాల్లో స్థలాల గుర్తింపు సమస్యగా మారింది. ఈ నేపథ్యంలోనే స్థలాల గుర్తింపుపై ఆ జిల్లాల కలెక్టర్లతో పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్‌ జి.సృజన ప్రత్యేకంగా మాట్లాడుతున్నారు.
రెండు భవననాలకూ వేర్వేరు డిజైన్లు
జీపీ భవనాలు, అంగన్వాడీ భవనాలకు యూనిక్‌ మోడల్‌ ఉండాలని మంత్రి సీతక్క ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఏ ఊరికెళ్లినా ఆయా భవనాలను చూడగానే అవి జీపీ భవనాలని, అంగన్వాడీ భవనాలని గుర్తించేలా ఉండేలా డిజైన్‌ రూపొందించాలని ఆదేశించారు. దీంతో పంచాయతీ రాజ్‌ ఇంజనీరింగ్‌ విభాగం రెండింటికీ వేర్వేరు డిజైన్లను రూపొందిస్తున్నది.
ఉపాధి హమీ నిధుల ద్వారా ఒక్కో పంచాయతీ భవన నిర్మాణ కోసం రూ. 20 లక్షలు ఖర్చు చేయనున్నారు. అదే అంగన్వాడీ భవనం కోసం ఉపాధి హమీ నిధుల ద్వారా రూ. 8 లక్షలు, 15వ ఫైనాన్స్‌ కమిషన్‌ నిధులు రూ. 2 లక్షలు, మహిళా శిశు సంక్షేమం నుంచి రూ. 2 లక్షల నిధులు మొత్తం కలిపి రూ.12 లక్షలు వెచ్చించనున్నారు. వచ్చే మార్చి నాటికి మొత్తం 1148 జీపీ భవనాలు, 1148 అంగన్వాడీ భవనాలను నిర్మించాలనే లక్ష్యంతో రాష్ట్ర సర్కారు ముందుకెళ్తున్నది.

త్వరలో నూతన జీపీ, అంగన్వాడీ భవనాలకు శంకు స్థాపన : మంత్రి సీతక్క
స్థలాల గుర్తింపు ప్రక్రియ చివరి దశలో ఉన్నది. త్వరలో నూతన భవనాలకు శంకు స్థాపన చేస్తాం. చివరి త్రైమాసికంలో భవనాల నిర్మాణాలు చేపట్టడం వల్ల పనులు పెండింగ్‌లో ఉంటున్నాయి. అందుకే ఈ దఫా మొదటి త్రైమాసికంలో స్థలాల గుర్తింపు ప్రక్రియను పూర్తి చేస్తున్నాం. యూనిక్‌ డిజైన్‌తో త్వరలోనే పనులు ప్రారంభిస్తాం. స్థలాల గుర్తింపులో కృషి చేసిన అధికారులు, కలెక్టర్లను అభినందించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -