నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండలంలోని నాగాపూర్ అంగన్వాడి కేంద్రంలో శనివారం చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాసం, అన్నప్రాసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కంపదండి అశోక్ ముఖ్య అతిథిగా పాల్గొని పలువురు చిన్నారులచేత అక్షరాలను దిద్దించి అక్షరాభ్యాసం చేయించారు. అదేవిధంగా చిన్నారులకు అంగన్వాడి కేంద్రంలో ప్రత్యేకంగా తయారు చేసిన ఆహార పదార్థాలను తినిపించి అన్నప్రాసన చేయించారు. ఈ సందర్భంగా సర్పంచ్ అశోక్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో అంగన్వాడీల బలోపేతానికి అనేక చర్యలు చేపడుతుందన్నారు.
అంగన్వాడి కేంద్రాల ద్వారా గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు పోషకాలతో కూడిన పౌష్టికాహారం అందుతుందన్నారు. చిన్నారులకు ఆటపాటలతో కూడిన ప్రీస్కూల్ విద్యను అంగన్వాడి కేంద్రాల ద్వారా అందించడం జరుగుతుందని, చిన్నారుల తల్లిదండ్రులు తమ పిల్లల్ని క్రమం తప్పకుండా అంగన్వాడి కేంద్రాలకు పంపించడం ద్వారా సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఉల్లెంగుల శశిధర్, పంచాయతీ కార్యదర్శి కాందేష్ సంధ్య, అంగన్వాడీ టీచర్ భూలక్ష్మి, ఏఎన్ఎం అరుణ కుమారి, ఆశ కార్యకర్తలు, చిన్నారుల తల్లులు, తదితరులు పాల్గొన్నారు.



