నార్వే చెస్ విజేత మాగస్ కార్ల్సన్
స్టాంజర్ (నార్వే) : ప్రపంచ చాంపియన్ దొమ్మరాజు గుకేశ్కు ఊహించని పరాభవం ఎదురైంది. టైటిల్పై కన్నేసి ఆఖరు రౌండ్ క్లాసికల్ చెస్ గేమ్ మొదలెట్టిన గుకేశ్.. సమయభావంతో చేసిన పొరపాటు భారీ మూల్యం చెల్లించేలా చేసింది. అమెరికా గ్రాండ్మాస్టర్ కారువానా ఫాబియానోతో ఆఖరు రౌండ్లో దొమ్మరాజు గుకేశ్ పరాజయం పాలయ్యాడు. వేసిన ఎత్తు.. ఓటమికి దారితీసిందని క్షణాల్లో గ్రహించిన గుకేశ్.. మరో రెండు సెకండ్ల సమయం మిగిలి ఉండగా కారువానాకు కరచాలనం ఇచ్చి అసహనంతో వెళ్లిపోయాడు. ఇదే సమయంలో ఐదుసార్లు ప్రపంచ చాంపియన్ మాగస్ కార్ల్సన్ ఆఖరు రౌండ్లో డ్రా చేసుకుని టైటిల్ విజేతగా నిలిచాడు. భారత గ్రాండ్మాస్టర్ అర్జున్ ఎరిగేశితో క్లాసికల్ గేమ్ను డ్రా చేసుకున్న కార్ల్సన్.. టైబ్రేకర్లో అర పాయింట్ను దక్కించుకున్నాడు. పది రౌండ్ల అనంతరం మాగస్ కార్ల్సన్ 16 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి ఆరోసారి నార్వే చెస్ టైటిల్ను సొంతం చేసుకున్నాడు. 15.5 పాయింట్లతో ఫాబియానో కారువానా రెండో స్థానంలో నిలువగా.. 14.5 పాయింట్లతో గుకేశ్ మూడో స్థానంతో సరిపెట్టుకున్నాడు. క్లాసికల్ గేమ్ ఆరో రౌండ్లో మాగస్ కార్ల్సన్పై మెరుపు విజయం సాధించిన దొమ్మరాజు గుకేశ్ తొలిసారి నార్వే చెస్ విజేతగా నిలిచేందుకు రంగం సిద్ధం చేసుకున్నాడు. కానీ ఆఖరు రౌండ్లో గుకేశ్ ఓటమి పాలవటం, కార్ల్సన్ డ్రా చేసుకోవటంతో భారత గ్రాండ్మాస్టర్ ఆశలు ఆవిరయ్యాయి. హికారు నకముర (14), అర్జున్ ఎరిగేశి (13) టాప్-5లో నిలిచారు. మహిళల విభాగంలో ఉక్రెయిన్ గ్రాండ్మాస్టర్ అనా 16.5 పాయింట్లతో చాంపియన్గా నిలిచింది. కోనేరు హంపి (15), వైశాలి రమేశ్బాబు (11) వరుసగా 3, 5వ స్థానాలు సాధించారు.
టాప్-10లో నలుగురు మనోళ్లే
ప్రపంచ చెస్లో భారత గ్రాండ్మాస్టర్లు అరుదైన ఘనత సాధించారు. ప్రపంచ చెస్ ర్యాంకింగ్స్లో టాప్-10లో తొలిసారి నలుగురు భారత గ్రాండ్మాస్టర్లు చోటు దక్కించుకున్నారు. ప్రపంచ చాంపియన్ దొమ్మరాజు గుకేశ్, ఆర్. ప్రజ్ఞానంద, అర్జున్ ఎరిగేశిలు నిలకడగా రాణిస్తూ టాప్-10లో కొనసాగుతుండగా.. ఇటీవల వరుస టోర్నమెంట్లలో మెరుస్తున్న యువ గ్రాండ్మాస్టర్ అరవింద్ చిదంబరం తాజాగా టాప్-10లో అడుగుపెట్టాడు. అరవింద్ తొమ్మిదో స్థానంలో నిలువగా..తొలిసారి టాప్-10 ర్యాంకింగ్స్లో భారత్ నుంచి నలుగురు గ్రాండ్మాస్టర్లు నిలిచారు.
గుకేశ్కు భంగపాటు
- Advertisement -
- Advertisement -