నవతెలంగాణ-హైదరాబాద్ : దివంగత నటుడు, తన తండ్రి నందమూరి హరికృష్ణ 69వ జయంతి సందర్భంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. తండ్రిని స్మరించుకుంటూ ఆయన సోషల్ మీడియాలో పెట్టిన ఓ పోస్ట్ అభిమానులను కదిలిస్తోంది. తన జీవితంలో తండ్రి స్థానం ఏమిటో వివరిస్తూ ఎన్టీఆర్ హృదయానికి హత్తుకునేలా నివాళి అర్పించారు.
‘‘ఈ అస్తిత్వం మీరు. ఈ వ్యక్తిత్వం మీరు. మొక్కవోని ధైర్యంతో కొనసాగే మా ఈ ప్రస్థానానికి నేతృత్వం మీరు. ఆజన్మాంతం తలుచుకునే అశ్రుకణం మీరే’’ అంటూ తండ్రితో తనకున్న అనుబంధాన్ని ఎన్టీఆర్ అక్షరాల్లో పంచుకున్నారు. ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. తారక్ అభిమానులు, నెటిజన్లు హరికృష్ణను గుర్తుచేసుకుంటూ కామెంట్లు పెడుతున్నారు.
నందమూరి హరికృష్ణ 2018 ఆగస్టు 30న నల్లగొండ జిల్లా అన్నెపర్తి సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో కన్నుమూసిన విషయం తెలిసిందే. నెల్లూరు జిల్లాలో ఒక అభిమాని వివాహానికి హాజరయ్యేందుకు వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.