Saturday, June 28, 2025
E-PAPER
Homeజాతీయంమోడీ వ్యూహం విఫలమైందా?

మోడీ వ్యూహం విఫలమైందా?

- Advertisement -

– 32 దేశాలకు 59 మంది ఎంపీలు
– దౌత్యానికి దక్కని ప్రచారం
– భారత ఎంపీల పర్యటనలకు కవరేజీ కరువు
– అంతగా పట్టించుకోని అంతర్జాతీయ మీడియా
– పాక్‌, ఉగ్రవాదం, ఆపరేషన్‌ సిందూర్‌లను ప్రస్తావించని పలు ప్రముఖ పత్రికలు
జమ్మూకాశ్మీర్‌లోని పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్‌ సిందూర్‌పై మోడీ సర్కారు తీవ్రంగా ప్రచారం చేసుకుంటున్నది. పాక్‌, పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌ (పీఓకే)లలో ఉగ్రస్థావరాలను నేల మట్టం చేశామని చెప్తున్నది. ఇందుకు సంబంధించి మోడీ ఫ్లెక్సీలు దేశంలో పలు చోట్ల దర్శనమిస్తున్నాయి. మరోపక్క, ఉగ్రవాదం, ఆపరేషన్‌ సిందూర్‌ తర్వాత పాక్‌ తీరును, వైఖరిని బహిర్గతం చేయటంలో భాగంగా కేంద్రం దౌత్య ప్రచారానికీ సిద్ధమైంది. ఇందుకు దేశంలోని పలు పార్టీలకు చెందిన ఎంపీలతో బృందాలను ఏర్పాటు చేసి, ఎంపిక చేసిన దేశాలకు పంపించింది. అయితే, ఆపరేషన్‌ సిందూర్‌తో రాజకీయంగా దేశంలో కావాల్సినంత లబ్ది పొందిన మోడీ సర్కారు.. విదేశాలలో దౌత్య ప్రచారం విషయంలో మాత్రం అంతగా విజయం సాధించలేదని విశ్లేషకులు చెప్తున్నారు. పలు దేశాల్లో పర్యటించిన భారత ఎంపీల బృందాలకు అక్కడి ప్రధాన వార్తపత్రికల్లో తగిన కవరేజీ రాకపోవటమే దీనికి నిదర్శనమని అంటున్నారు.

న్యూఢిల్లీ : దేశంలోని కోట్లాది మంది పన్ను చెల్లింపుదారుల సొమ్ముతో 59 మంది ఎంపీలు ఏడు బృందాలుగా 32 దేశాలలో ఉన్నతస్థాయి పర్యటనలు జరిపారు. భారత ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నప్పటికీ.. వీరి పర్యటనలకు సంబంధించి ప్రముఖ వార్తసంస్థలైన న్యూయార్క్‌ టైమ్స్‌, లె మోండే, ది గార్డియన్‌లలో ఎలాంటి కవరేజీ రాలేదు. ఎంపీల దౌత్య పర్యటనలపై భారత మీడియా తీవ్రంగా ప్రచారం చేసినా.. అంతర్జాతీయ మీడియాలో మాత్రం ఆశించినంత కవరేజీ దక్కలేదు. ఆపరేషన్‌ సిందూర్‌కు అనుకూలంగా ప్రపంచ మద్దతును కూడగట్టటం, యూఎన్‌ఎస్‌సీ శాశ్వత లేదా నాన్‌-పర్మనెంట్‌ సభ్య దేశాలలో సమావేశాలు నిర్వహించటం ద్వారా పాక్‌ ప్రాయోజిత ఉగ్రవాదం విషయంలో ఆ దేశం తీరును బయటపెట్టటం, జవాబుదారీతనాన్ని తీసుకురావటం ఈ బృందాల పని.
పలు దేశాల పర్యటనల్లో భాగంగా భారత ఎంపీలు తమ అధికారిక ప్రకటనలలో ఉగ్రవాదానికి అండగా ఉన్న పాకిస్తాన్‌ తీరును తీవ్రంగా విమర్శించారు. అయితే, ఈ విషయంలో అంతర్జాతీయ మీడియా మాత్రం.. భారత్‌లోని మీడియా చేసే ప్రచారానికి భిన్నంగా ఉండటం గమనార్హం. కొలంబియాలో దౌత్య విజయం కొంత సానుకూలంగా కనిపించినా.. కొలంబియన్‌ వార్తాపత్రికలు మాత్రం ఎంపీల పర్యటనను పూర్తిగా విస్మరించటం గమనార్హం.

ఫ్రాన్స్‌
బీజేపీ ఎంపీ రవిశంకర్‌ ప్రసాద్‌ నేతృత్వంలోని భారత ప్రతినిధి బృందం గతనెల 25 నుంచి 27 మధ్య సందర్శించింది. అక్కడి పార్లమెంటు దిగువ సభలోని ఎంపీల బృందాన్ని కలిసింది. అలాగే, ఫ్రెంచ్‌, అంతర్జాతీయ మీడియా సంస్థల నుంచి సీనియర్‌ జర్నలిస్టులతో సైతం సమావేశమైంది. ఇంత జరిగినా.. ఫ్రాన్స్‌లోని అత్యంత ప్రముఖ వార్తపత్రికలైన లె మోండే లేదా లె ఫిగరోలు భారత ఎంపీల పర్యటనను కవర్‌ చేయకపోవటం గమనార్హం. రష్యాకు అనుకూలంగా అభిప్రాయాలకు పేరుగాంచిన జర్నలిస్ట్‌ రెగిస్‌ లే సోమియర్‌ను ఎంపీల బృందం కలిసినప్పటికీ.. ఆయనకు చెందిన మీడియా హౌజ్‌ ఒమెర్టా కూడా భారత ప్రతినిధి బృందం సందేశం గురించి ఏమీ ప్రచురించలేదు.

రష్యా
డీఎంకే ఎంపీ కనిమొళి కరుణానిధి నేతృత్వంలోని ప్రతినిధి బృందం మే 22 నుంచి మే 24 వరకు రష్యాలో పర్యటించింది. ఆర్టీ, రోసిస్కయా గెజిటా వంటి రష్యన్‌ మీడియా, ఉప విదేశాంగ మంత్రి ఆండ్రీ రుడెంకో, దేశ డూమా అంతర్జాతీయ వ్యవహారాల కమిటీ చైర్‌పర్సన్‌ లియోనిడ్‌ స్లట్స్కీ, ఇతర అధికారులతో భారత ప్రతినిధి బృందం జరిపిన సమావేశాలను విస్తృతంగా కవర్‌ చేసింది. అయితే, ఉగ్రవాదానికి పాక్‌ మద్దతిస్తోందని గుర్తిస్తూ రష్యా ఎలాంటి అధికారిక ప్రకటననూ విడుదల చేయకపోవటం గమనార్హం.

యునైటెడ్‌ కింగ్‌డమ్‌
రవిశంకర్‌ ప్రసాద్‌ అధ్యక్షతన ఎంపీల బృందం మే 31 నుంచి జూన్‌ 3 వరకు యునైటెడ్‌ కింగ్‌డమ్‌ (యూకే)ను సందర్శించింది. లండన్‌లోని అంబేద్కర్‌ మ్యూజియంను సందర్శించి, ఇండియా హౌస్‌లో ప్రవాస భారతీయులతో సంభాషించింది. ఆ దేశ విదేశాంగ కార్యదర్శి ప్రీతి పటేల్‌ను సైతం కలిసింది. యూకేలోని మంత్రులతోనూ సమావేశ మైంది. అధికార, ప్రతిపక్ష పార్టీల నాయకులనూ కలిసింది. అక్కడి భారత గ్రూపులు, సమూహాలు, సంఘాలతో సంభాషించింది. అయినప్పటికీ.. భారత ఎంపీల పర్యటన విషయంలో బీబీసీ, ది గార్డియన్‌ లేదా ది డైలీ టెలిగ్రాఫ్‌ వంటి ప్రముఖ మీడియా సంస్థల నుంచి ఎలాంటి కవరేజీ రాలేదు.

జపాన్‌
జేడీయూ ఎంపీ సంజరు ఝా నేతృత్వంలోని ఎంపీల బృందం మే 22 నుంచి మే 24 మధ్య జపాన్‌లో పర్యటించింది. ఈ పర్యటనలో భాగంగా జపాన్‌ విదేశాంగ మంత్రి, ప్రతినిధుల సభ స్పీకర్‌, మాజీ ప్రధానిని కలిశారు. మీడియా, థింక్‌ట్యాంక్‌లతో సంభాషించారు. అయితే, ఈ సమావేశాలకు జపాన్‌ మీడియా నుంచి అంతగా కవరేజ్‌ రాలేదు. కొన్ని ప్రముఖ దినపత్రికలైతే.. ఎంపీల పర్యటననే పట్టించుకోలేదు.

కువైట్‌
బీజేపీ ఎంపీ బైజయంత్‌ పాండా నేతృత్వంలోని ఎంపీల బృందం.. మే 26, 27 తేదీల్లో కువైట్‌లో పర్యటించింది. ఉప ప్రధాని, క్యాబినెట్‌ వ్యవహారాల సహాయ మంత్రి షెరిదా అబ్దుల్లా సాద్‌ అల్‌-మౌషెర్జీని కలిసింది. కువైట్‌కు చెందిన థింక్‌ ట్యాంక్‌ రికనైసెన్స్‌ రీసెర్చ్‌తో ప్రత్యేక సంభాషణనూ నిర్వహించింది. కువైట్‌ జాతీయ లైబ్రరీలో జరిగిన ప్రదర్శనకూ హాజరైంది. అయితే, అక్కడి ప్రముఖ దినపత్రిక కువైట్‌ టైమ్స్‌ మాత్రం పహల్గాం ఉగ్రదాడి విషయంలో పాక్‌ గురించి ప్రస్తావించలేదు. భారత్‌లో జరిగిన పరిస్థితులపై చర్చలు జరిగినట్టుగా అక్కడి మిగతా ముఖ్యమైన పత్రికలు పేర్కొనకపోవటం గమనార్హం.

బహ్రెయిన్‌
పాండా నేతృత్వంలోని భారత ఎంపీల బృందం మే 24, 25 తేదీలలో ఇక్కడ పర్యటించింది. బహ్రెయిన్‌ ఉపప్రధాని షేక్‌ ఖలీద్‌ బిన్‌ అబ్దుల్లా అల్‌ ఖలీఫా, షురా కౌన్సిల్‌ (పార్లమెంటు ఎగువ సభ) చైర్మెన్‌ అలీ బిన్‌ సలేV్‌ా అల్‌ సలేV్‌ాను కలిసింది. రెండు థింక్‌ ట్యాంక్‌లతో కూడా సంభాషించింది. అయితే, బహ్రెయిన్‌ న్యూస్‌ ఏజెన్సీ.. భారత ఎంపీల పర్యటన విషయంలో ఉగ్రవాదం గురించి నివేదించలేదు. బహ్రెయిన్‌- భారత ద్వైపాక్షిక సహకారంపై పర్యటనగా పేర్కొనటం గమనార్హం.

సౌదీ అరేబియా
పాండా బృందం మే 27-29 వరకు సౌదీ అరేబియాలో పర్యటించింది. షురా కౌన్సిల్‌ డిప్యూటీ స్పీకర్‌, షురా కౌన్సిల్‌ సౌదీ అరేబియా విదేశాంగా శాఖ సహాయ మంత్రితో సమావేశమైంది. అయితే, ఇక్కడి సౌదీ గెజిట్‌ మాత్రం.. ఉగ్రవాద సమస్యనే ప్రస్తావించలేదు. అలాగే, పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్‌ సిందూర్‌ గురించి కూడా ప్రస్తావించకపోవటం గమనార్హం.

యూఏఈ
శివసేన ఎంపీ శ్రీకాంత్‌ ఏక్‌నాథ్‌ శిండే నేతృత్వంలోని ప్రతినిధి బృందం మే 22న యూఏఈలో పర్యటించింది. ఆ దేశ మంత్రి, ఫెడరల్‌ నేషనల్‌ కౌన్సిల్‌ రక్షణ, అంతర్గత, విదేశాంగ కమిటీ చైర్మెన్‌, ఇతర పార్లమెంటేరియన్లను ఈ బృందం కలిసిందని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. అయితే, ఉగ్రవాదంపై భారత్‌ చేసిన ఆరోపణలను, దానిని పాక్‌ ఖండించిందన్న వార్తనూ అక్కడి ది నేషనల్‌ అనే ఆంగ్ల వార్తపత్రిక నివేదించింది.
అలాగే, గయానా, పనామా, సియెర్రా లియోన్‌, దక్షిణాఫ్రికా, దక్షిణ కొరియా, ఇథియోపియా, మలేషియాల్లో భారత ఎంపీల పర్యటనకు సంబంధించి అక్కడి ప్రధాన వార్తా పత్రికలలో సరైన కవరేజీ, ప్రాధాన్యత లభించలేదు. ఉగ్రవాదం విషయంలో పాక్‌ తీరును బయటపెట్టాలన్న లక్ష్యంతో బయలుదేరిన ఎంపీల బృందాలకు ఇలాంటి పరిస్థితులు ఎదురుకావటం ఊహించని పరిణామమని విశ్లేషకులు చెప్తున్నారు.

ఖతార్‌
ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే నేతృత్వంలోని బృందం మే 24 నుంచి మే 26 వరకు ఖతార్‌ను సందర్శించింది. ఆ దేశ విదేశాంగ శాఖ సహాయ మంత్రి, అంతర్గత వ్యవహారాల సహాయ మంత్రి, షురా కౌన్సిల్‌ డిప్యూటీ స్పీకర్‌ను, అల్‌ షార్క్‌, ది పెనిన్సులా వార్తాపత్రికల సంపాదకీయ సిబ్బందిని కలిసింది. అయితే, వీరి పర్యటనకు సంబంధించి అల్‌ షార్క్‌ నివేదించలేదు. ఖతార్‌ కేంద్రంగా పని చేసే అంతర్జాతీయ మీడియా సంస్థ అల్‌ జజీరా.. పాక్‌ను భారత్‌ నిందించిందనీ, దాన్ని పాక్‌ తోసిపుచ్చిందని బ్యాలెన్స్‌డ్‌గా కథనాన్ని ప్రసారం చేసింది.
అమెరికా
కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌ నేతృత్వంలోని ప్రతినిధి బృందం న్యూయార్క్‌లో పర్యటించింది. 9/11 స్మారక చిహ్నం వద్ద నివాళులు అర్పించింది. ఆ తర్వాత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రముఖ థింక్‌ ట్యాంక్‌లు, విద్యా సంస్థలు, పత్రికా సభ్యులతో సమావేశాల్లో నిమగమైంది. అయినప్పటికీ.. ఏ ఒక్క ప్రధాన అమెరికన్‌ మీడియా సంస్థ కూడా వీరి పర్యటనను కవర్‌ చేయలేదు. అయితే, సదరు ప్రతినిధి బృందం ఏ ఒక్క అమెరికా ప్రముఖులనూ కలవని కారణంగానే ఈ పర్యటనపై అమెరికా మీడియా మౌనంగా ఉండటానికి కారణమై ఉండొచ్చని విశ్లేషకులు చెప్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -