నవతెలంగాణ-హైదరాబాద్: గాజా-ఇజ్రాయిల్ మధ్య కాల్పుల విరమణ జరగాలని ఐక్యరాజ్యసమితి ఓటింగ్ నిర్వహించింది. ఈ ఓటింగ్కు భారత్ హాజరకాలేదు. ఈక్రమంలో భారత్ ప్రభుత్వ నిర్ణయంపై కాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. గాజాలో ఇజ్రాయిల్ మారణోమం సృష్టిస్తుందని వాపోయారు. మారణకాండను కట్టడి చేయడానికి అంతర్జాతీయ సంస్థ ముందడకు వేస్తే.. కేంద్ర ప్రభుత్వం అర్థంలేని నిర్ణయం తీసుకుందని, ఇది సిగ్గుచేటు అని ఆమె శనివారం సోషల్ మీడియా ఎక్స్ వేదికగా మండిపడ్డారు. బెంజమిన్ నెతన్యాహు ఒక దేశాన్ని మొత్తం నాశనం చేస్తుండగా భారతదేశం నిశ్శబ్దంగా నిలబడటమే కాకుండా ఇరాన్పై దాడి చేసి, దాని సార్వభౌమత్వాన్ని బహిరంగంగా ఉల్లంఘిస్తుందని, అన్ని అంతర్జాతీయ నిబంధనలను ఇరాన్ పూర్తిగా బేఖాతరు చేస్తుందని ఆమె ఆరోపించారు. గాజాలో ఎక్కువ మొత్తంలో మహిళలు, చిన్నారులు చంపబడుతున్నారని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. నిజమైన ప్రపంచ నాయకత్వం న్యాయాన్ని కాపాడుకోవడానికి ధైర్యాన్ని కోరుతుందని, మనం మానవత్వం కోసం తమ గొంతును తిరిగి పొందాలి, సత్యం అహింస కోసం నిర్భయంగా నిలబడాలని ఆమె పిలుపునిచ్చారు.
ఇజ్రాయిల్-హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధం విరమించాలని కోరుతూ ఐక్యరాజ్య సమితి (ఐరాస) సర్వసభ్య సమావేశంలో ఓటింగ్ జరిగింది. దీనికి భారత్ గైర్హాజరు అయింది. ఈ ఓటింగ్లో 149 దేశాలు ప్రతిపాదనకు అనుకూలంగా ఓటు వేశాయి. అమెరికా, ఇజ్రాయిల్ తో పాటు 10 దేశాలు వ్యతిరేకించాయి.భారత్ సహా మరో 19 దేశాలు ఓటింగ్లో పాల్గొనలేదు. దక్షిణాసియా,బ్రిక్స్, ఎస్సీఓ దేశాల్లో భారత్ ఒక్కటే ఓటింగ్ కి దూరంగా ఉంది. గత డిసెంబర్ 2024లో ఇటువంటి ప్రతిపాదనకు అనుకూలంగా ఓటు వేసిన భారత్, ఆరు నెలల తర్వాత తన నిర్ణయాన్ని మార్చుకోవడం గమనార్హం.