– నేడు వార్షిక సర్వ సభ్య సమావేశం
హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) మళ్లీ వేడెక్కనుంది. ఆఫీస్ బేరర్లలో విభేదాలు, ఐపీఎల్18 నిర్వహణలో సన్రైజర్స్ హైదరాబాద్తో వివాదానికి తాజాగా ఆర్థిక ఉల్లంఘనలు తోడయ్యాయి. ఉప్పల్ స్టేడియంలో నేడు హెచ్సీఏ వార్షిక సర్వ సభ్య సమావేశం జరుగనుంది. ఈ ఏజీఎంలో బీసీసీఐ సమావేశాలకు హాజరయ్యే హెచ్సీఏ ప్రతినిధితో పాటు పలు కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది. ఈ నేపథ్యంలో మద్దతు కూడగట్టేందుకు 136 క్లబ్లకు అభివృద్ది నిధుల పేరిట రూ. 4 కోట్లను నిబనంధనలకు విరుద్ధంగా చెల్లింపులు చేశారని ఆరోపణలు వస్తున్నాయి. ఈ వ్యవహారం కార్యదర్శి ప్రమేయం లేకుండా జరిగిందని, ఈ అంశంలో సమగ్ర విచారణ చేపట్టాలని అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)కి ఫిర్యాదులు వెళ్లాయి. ఈ పరిస్థితుల్లో ఏజీఎం వాడీవేడిగా సాగనుందని క్లబ్ కార్యదర్శులు అంటున్నారు. హెచ్సీఏలో పారదర్శక పరిపాలన తీసుకొచ్చేందుకు ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులను పెంచాలని, జస్టిస్ లోధా సిఫారసుల ప్రకారం అసోసియేషన్లో తొమ్మిదేండ్ల పదవీకాలం పూర్తి చేసుకున్నవారు వైదొలగాలని కొందరు సభ్యులు నేడు ఏజీఎంలో తీర్మానం ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తోంది.
వేడెక్కనున్న హెచ్సీఏ రాజకీయం
- Advertisement -
- Advertisement -