న్యూఢిల్లీ: ఢిల్లీ, దేశరాజధాని ప్రాంతం (ఎన్సీఆర్)తో సహా ఉత్తరాది రాష్ట్రాలను భారీ వర్షాలు కుదిపేస్తున్నాయి. శుక్రవారం తెల్లవారుజామన నుంచి ప్రారంభమైన ఈ వర్షాలతో జనం అతలాకుతలమవుతున్నారు. వర్షాల కారణంగా శుక్రవారం సాయంత్రం వరకూ మొత్తంగా ఏడుగురు మృతి చెందగా, వాన నీరు పొంగి పొర్లడంతో రోడ్లపై ట్రాఫిక్ స్థంభించిపోయింది. అనేక ప్రాంతంలో మంచినీటి సరఫరా, విద్యుత్ సరఫరాకు అటంకం ఏర్పడింది. అనేక విమనాలు సర్వీసులు రద్దు చేశారు. లేదా ఆలస్యంగా నడిచాయి. మరోవైపు మే 3,4 తేదీల్లో కూడా ఉత్తర భారతంలో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఢిల్లీలో అనేక ప్రాంతాలు జలదిగ్భంధంలో చిక్కుకున్నాయి. రోడ్లపై చెట్లు కూలిపోయాయి. నజాఫ్గఢ్ ప్రాంతంలో ఇంటిపై చెట్టు కూలిపోవడంతో ఒక మహిళ, ముగ్గురు పిల్లలు అక్కడిక్కడే మరణించారు. మహిళ భర్తకు తీవ్రగాయాలయ్యాయి. ఢిల్లీలో ఉదయం 5 గంటలకు ప్రారంభమైన వర్షం కేవలం మూడు గంటల్లోనే 77 మి.మీ వర్షం కురిసిందని భారత వాతావరణ శాఖ తెలిపింది. నగరానికి రెడ్ ఎలర్ట్ జారీ చేసింది. ఢిల్లీ విమానాశ్రయంలో ల్యాండ్ కావాల్సిన మూడు విమానాలను దారి మళ్లించారు. 200కు పైగా విమానాలు ఆలస్యంగా నడిచాయి. శుక్రవారం ఉత్తరప్రదేశ్లోనూ భారీ వర్షాలు కురిసాయి. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో పిడుగులు పడి ముగ్గురు మరణించారు. ఏతాV్ా జిల్లాలోని భగవంత్పూర్ గ్రామంలో 17 ఏళ్ల బాలిక దీక్ష పిడుగుపడి మరణించగా, ఫిరోజాబాద్ జిల్లాలో షికోహాబాద్-నానెమౌ రోడ్డుపై పని చేస్తున్న ఇద్దరు ఉపాధి కూలీ కార్మికులు సత్యేంద్ర (35), విష్ణు (25) మరణించారు. పిడుగుపాటుతో అనేక మంది గాయపడ్డారు. అనేక ప్రాంతాల్లో పంట నష్టం వాటిల్లింది. హిమాచల్ప్రదేశ్లో అనేక ప్రాంతాల్లో భారీ వడగాళ్ల కురిసింది. రాజధాని సిమ్లాలో అనేక ప్రధాన రహదారులపై చెట్లు కూలిపోవడంతో ట్రాఫిక్కు తీవ్ర ఇబ్బంది ఏర్పడింది. పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లోనూ అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసాయి. జమ్మూకాశ్మీర్లోనూ శుక్రవారం భారీ వర్షాలు కురిసాయి. దీంతో జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై కొన్ని ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో ఈ రహదారిని అధికారులు మూసివేశారు.
ఉత్తరాదిని కుదుపేస్తున్న భారీ వర్షాలు
- Advertisement -
RELATED ARTICLES