నవతెలంగాణ-హైదరాబాద్: మొంథా తుపాను ప్రభావంతో ఒడిషా, రాజస్తాన్లోనూ మంగళవారం భారీ వర్షాలు కురిసాయి. ముఖ్యంగా ఒడిషాలోని తీర, దక్షిణ భాగానికి చెందిన 15 జిల్లాలు తుపాను ప్రభావానికి గురయ్యాయి. భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడ్డం, ఇళ్లు ధ్వంసమవ్వడం, చెట్లు కూలడం వంటి ఘటనలతో సాధారణ జనజీవనం స్తంభించింది. మల్కాన్గిరి, కొరాపుట్, గజపతి, గంజాం, కంధమాల్, కలహండి, నబరంగ్పూర్ జిల్లాలో భారీ వర్షాలు కురిసాయి. గజపతి జిల్లాలో అనక గ్రామ పంచాయతీ పరిధిలోని రహదాదిపై కొండచరియలు విరిగపడడంతో ఐదు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
అలాగే ఇదే జిల్లాలో కాశీనగర్ బ్లాక్లోని పర్టోడ పంచాయతీ వద్ద లింగ-బరభ రహదారిపైనా కొండచరియలు విరిగిపడ్డాయి. తుపాను ప్రభావంతో రాజస్తాన్లోని బుండి జిల్లాలో నైన్వా వద్ద 24 గంటల వ్యవధిలో 130 మీమీ వర్షపాతం నమోదయింది. ఉదయపూర్, కొటా జిల్లాలోనూ భారీ వర్షాలు కురిసాయి.
కేరళలో ఎనిమిది జిల్లాలకు ఎల్లో అలెర్టు
తుపాను ప్రభావంతో కేరళలోని ఎనిమిది జిల్లాలో బుధవారం భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతవరణ శాఖ హెచ్చరించింది. తిరువనంతపురం, కొల్లాం, పథనంథిట్ట, అలప్పుజ, కొట్టాయం, ఇడుక్కి, ఎర్నా కుళం, త్రిస్సూర్ జిల్లాలకు ఎల్లో అలెర్టు జారీ చేసింది.
ఎన్డిఎంఎ హెచ్చరికలు
మొంథా తుపాను నేపథ్యంలో మొబైల్ ఫోన్లకు నేరుగా రియల్ టైమ్ హెచ్చరికలను జారీ చేయడాన్ని జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ (ఎన్డిఎంఎ) ప్రారంభిం చింది. ఆంధ్రప్రదేశ్, ఒడిషా వ్యాప్తంగా మంగళవారం ఇలాంటి హెచ్చరికలను జారీ చేసింది.
రైల్వే మంత్రి సమీక్ష
మొంథా తుపాను నేపథ్యంలో రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. తుపాను హెచ్చరికలను అంచనా వేస్తూ ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారుల్ని మంత్రి ఆదేశించారు. ముఖ్యంగా విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు డివిజన్లలోవార్ రూమ్లను ఏర్పాటు చేయాలని, అవసరమైన సామాగ్రి, యంత్రాలను సిద్ధం చేసుకోవాలని సూచించారు.



