నవతెలంగాణ-హైదరాబాద్: ఈ నెల 13 నుంచి మూడు రోజుల పాటు అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. 13, 14, 15వ తేదీలకు ఆరెంజ్ అలర్ట్ను జారీ చేసింది. హైదరాబాద్లోనూ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. బంగాళాఖాతంలో అతి త్వరలోనే ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. కోస్తా ఆంధ్రా తీరంలోని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఈ నెల 13న అల్పపీడనం ఏర్పడుతుందని, దీని ప్రభావంతో తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ప్రస్తుతం దక్షిణ కోస్తా ఆంధ్రా తీరం వద్ద ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నదని వెల్లడించింది.
శనివారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ మోస్తరు వర్షాలు కురిశాయి. ముఖ్యంగా హైదరాబాద్ సిటీలోని పలు ప్రాంతాల్లో అతి భారీ వర్షపాతం నమోదైంది. అత్యధికంగా రంగారెడ్డి జిల్లా తొర్రూరు (హయత్నగర్)లో 13 సెంటీమీటర్ల వర్షం కురిసింది. అదే జిల్లా పెద్దఅంబర్పేటలో 9.6, బాలాపూర్ ఏవియేషన్ అకాడమీ వద్ద 9.5, హయత్ నగర్ డిఫెన్స్ కాలనీ వద్ద 8.8 సెంటీమీటర్ల వర్షం కురిసింది.