నవతెలంగాణ – హైదరాబాద్ : కర్ణాటకలో చాలా కాలం నుంచి బైక్ టాక్సీ సేవలపై వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్రభుత్వం బైక్ టాక్సీ సేవలను బ్యాన్ చేయగా దీనిపై ప్రముఖ స్టార్టప్ రాపిడో కర్ణాటక హైకోర్టును ఆశ్రయించింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై స్టే ఇవ్వాలని కోరింది. అయితే తాజాగా కర్ణాటక హైకోర్టు కూడా ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తూ జూన్ 16 నుంచి బైక్ టాక్సీ సేవలను నిలిపివేయాలని ఆదేశించింది. దీనికి కొన్ని రోజుల ముందు కర్ణాటక రవాణా శాఖ అక్కడ బైక్ టాక్సీ సేవలను ఆఫర్ చేస్తున్న కంపెనీలకు నోటీసులు పంపుతూ చట్టప్రకారం ఈ సేవలు అక్రమమైనవిగా పేర్కొంది.
కమర్షియల్ వాహనాలను మాత్రమే పబ్లిక్ రవాణా కోసం బైక్ టాక్సీలుగా నడిపించేందుకు వీలవుతుందని తేల్చి చెప్పింది. ప్రస్తుతం కోర్టు తీర్పుతో ఓలా, ఉబెర్, రాపిడో వంటి సంస్థలు కర్ణాటక వ్యాప్తంగా తమ బైక్ టాక్సీ సేవలను మూసేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం కక్కిరిసిన బెంగళూరు లాంటి అధిక ట్రాఫిక్ ఉన్న నగరాల్లో తక్కువ రేటుకు వేగవంతమైన సేవలను బైక్ టాక్సీలు అందించటం తెలిసిందే. కానీ ప్రస్తుత చర్యలతో ఇకపై బైక్ టాక్సీ సేవలు అందుబాటులో ఉండబోవని వెల్లడైంది.