నవతెలంగాణ-హైదరాబాద్: హిమంత బిస్వా శర్మ దేశంలోనే అత్యంత అవినీతి ముఖ్యమంత్రి అని కాంగ్రెస్ నేత, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గురువారం పేర్కొన్నారు. బకాజన్ నియోజకవర్గ పార్టీ అభ్యర్థి రతన్ ఎంగ్తికి మద్దతుగా జరిగిన ఎన్నికల సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోడీ, అమిత్షా, హిమంత శర్మలు ‘ల్యాండ్ ఎటిఎం’ ఏర్పాటు చేశారని, పేదలనుండి భూమిని దోచుకుని కార్పోరేట్లకు దోచిపెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మొత్తం 98,400 బిగాల భూమిని ముగ్గురు కార్పోరేట్లకు దోచిపెట్టారని అన్నారు. భారత్లోనే అత్యంత అవినీతి ముఖ్యమంత్రి హిమంత బిస్వాశర్మ అని, ఆయన కుటుంబం కూడా అవినీతిలో నెం.1 అని అన్నారు. వారి అవినీతికి వ్యతిరేకంగా కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు. అవినీతి ఆరోపణల కారణంగానే హిమంత ప్రధాని మోడీ నియంత్రణలో ఉన్నారని, సిండికేట్ల ద్వారా ఆయన అస్సాంలో పాలన చేస్తున్నారని అన్నారు.
ప్రముఖ గాయకుడు జుబీన్ గార్గ్ రాష్ట్రానికి, ప్రజలకు అండగా నిలిచారని అన్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోగా కాంగ్రెస్ పార్టీ ఆయన మృతికి న్యాయం చేకూరుస్తుందని హామీ ఇచ్చారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 244(ఎ)ని పూర్తిగా అమలు చేస్తామని హామీ ఇస్తున్నామని అన్నారు. కార్బీ ఆంగ్లాంగ్, ఆరవ షెడ్యూల్ పరిధిలోని అన్ని ప్రాంతాల పాలన గువహటి లేదా ఢిల్లీ నుండి కాకుండా స్థానిక ప్రజల చేతుల్లోనే ఉంటుందని అన్నారు.



