ముఖ్యమంత్రికి ఆహ్వానం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఉస్మానియా యూనివర్సిటీలో ఈ నెల 21న జరిగే కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. ఈ మేరకు ఆదివారం ఆ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ కుమార్ మొలుగరం, ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సి.కాశీం హైదరాబాద్ జూబ్లిహిల్స్ లోని సీఎం నివాసంలో ఆయన్ను కలిసి కార్యక్రమంలో పాల్గొనాలని ఆహ్వానించారు. ఓయూలో రూ.80 కోట్ల వ్యయంతో నిర్మాణమై 1,200 మంది విద్యార్థులకు వసతి కల్పించే రెండు హాస్టల్స్ను ప్రారంభించి, గిరిజన సంక్షేమం శాఖ ఆర్థిక సహాయంతో మరో 300 మంది విద్యార్థులకు వసతి కల్పించే రెండు కొత్త హాస్టల్స్ నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం సీఎం చేతులమీదు గా జరుగనున్నది. ఇప్పటికే ఓయూలో ఉన్న 25 హాస్టళ్లలో 7,223 మంది విద్యార్థులకు వసతి ఉండగా సీఎం చేతుల మీదుగా ప్రారంభించే హాస్టల్స్ అదనపు వసతిని సమకూర్చనున్నాయి. ఇదే కార్యక్రమంలో దాదాపు రూ.10 కోట్ల నిధులతో డిజిటల్ లైబ్రరీ రీడింగ్ రూం పనులకు కూడా సీఎం ప్రారంభించనున్నారు. అదే రోజు ఓయూలో ఉన్న టాగూర్ ఆడిటోరియంలో వెయ్యి మంది ప్రొఫెసర్లను, విద్యార్థులను ఉద్దేశించి ”తెలంగాణ విద్యా రంగంలో రావాల్సిన మార్పులు-ప్రభుత్వ ప్రణాళిక” అనే విషయంపై సీఎం ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొననున్నారు. గడిచిన 20 ఏళ్ల కాలంలో ఓయూలోకి ముఖ్యమంత్రి హౌదాలో వచ్చి ప్రసంగించనున్న తొలి సీఎం రేవంత్ రెడ్డియేనని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ”సీఎం రీసెర్చ్ ఫెలో షిప్ ” తో పాటు విదేశీ పర్యటనకు వెళ్లే విద్యార్థులకు ఆర్థిక సహాయాన్ని అందించే పథకాన్ని సీఎం చేతుల మీదుగా ప్రారంభించనున్నట్టు వీసీ తెలిపారు.
21న ఓయూలో హాస్టల్స్ ప్రారంభం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES