– సన్మానం చేయాలనుకుంది ఎవరు?
– స్టేడియం గేట్లన్నీ తెరిచారా?
– బెంగళూరు తొక్కిసలాట ఘటనపై కర్ణాటక హైకోర్టు ఆగ్రహం
– సుమోటోగా విచారణ
– 10వ తేదీకల్లా సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశాలు
– సరిగా సన్నద్ధం కాలేకపోయామని అంగీకరించిన ప్రభుత్వం
బెంగళూరు: బెంగళూరు తొక్కిసలాట ఘటనపై కర్నాటక హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. 11మంది మృతికి దారి తీసిన ఈ ఘటనను కర్నాటక హైకోర్టు సుమోటోగా తీసుకుని గురువారం మధ్యాహ్నం విచారణ చేపట్టింది. కనీస ఏర్పాట్లు లేకుండా ఇంత భారీ స్థాయి కార్యక్రమాలను ఎలా నిర్వహిస్తారని ఈ సందర్భంగా కోర్టు ప్రశ్నించింది. ఇంతటి భారీ స్థాయి కార్యక్రమాలు జరుగుతుంటే సమగ్రంగా ఎందుకు భద్రతా చర్యలు తీసుకోలేదంటూ చీఫ్ జస్టిస్ ప్రశ్నించారు.
ఈ సందర్భంగా స్టేడియానికి గల 21 గేట్లు తెరిచారా అని కోర్టు ప్రశ్నించింది. అసలు క్రికెటర్లకు సన్మానం చేయాలని నిర్ణయించింది ఎవరు?. సన్మానం చేయాలనుకుంది ఆర్సీబీనా? కర్నాటక అసోసియేషనా? లేక ప్రభుత్వమా? అంటూ అడ్వకేట్ జనరల్కు న్యాయవాది సూటిగా పలు ప్రశ్నలు వేశారు. ఈ విషాదానికి దారి తీసిన కారణాలను వివరించాలని కోరారు. ఈ ఘటన జరగకుండా నివారించడానికి తీసుకున్న చర్యలేమిటి, భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా చూసేందుకు తీసుకోబోయే చర్యలేమిటి అని ప్రశ్నించింది. ఇంత ప్రాణ నష్టం జరిగిన ఈ ఘటనలో వాస్తవాలను కప్పిపుచ్చాలని చూస్తున్నారన్నారు. ఈ నెల 10లోగా అన్ని వివరాలతో కూడిన నివేదిక అందచేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది.
ఆర్సీబీ, క్రికెట్ అసోసియేషన్, ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థలపై ఎఫ్ఐఆర్
భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్లు 105, 125(1), (2), 132, 121-1, 190 కింద ఆర్సీబీ, కర్నాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్, ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థ డీఎన్ఏపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. నేరపూరితమైన నిర్లక్ష్యం, నేరపూరితమైన హత్య సహా పలు తీవ్రమైన అభియోగాలను మోపారు. ఎ.కె.గిరీష్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కబ్బన్పార్క్ పోలీసు స్టేషన్లో ఎఫ్ఐఆర్ దాఖలైంది.
అసహజ మరణాలుగా నివేదికలు
తొక్కిసలాటకు సంబంధించి బెంగళూరు నగర పోలీసులు ఎలాంటి ఎఫ్ఐఆర్ను నమోదు చేయలేదు. అందుకు బదులుగా విడివిడిగా అసహజ మరణాలుగా పేర్కొంటూ 11 యూడీఆర్ (అసహజ మృతి నివేదిక)లను దాఖలు చేశారు. ఎఫ్ఐఆర్ నమోదైతే 24గంటల్లోగా దాన్ని సంబంధిత న్యాయస్థానానికి తెలియచేయాల్సి వుంటుంది. ఆ కేసులోని తదుపరి పరిణామాలన్నింటినీ ఎప్పటికప్పుడు కోర్టుకు వివరించాల్సి వుంటుంది. అదే అసహజ మృతి నివేదిక కేసులో అయితే ఎలాంటి క్రిమినల్ దర్యాప్తు వుండదు, ఆ పరిధిలోని తహసీల్దార్ ఆ దర్యాప్తును చూసుకుంటారు.
అభ్యర్ధన మేరకే…
క్రికెట్ ఫ్రాంచైజ్ నుంచి వచ్చిన అభ్యర్ధనల మేరకే ఈ కార్యక్రమాన్నినిర్వహించామని కాంగ్రెస్ ఎమ్మెల్సీ, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కుమారుడు యతీంద్ర సిద్ధరామయ్య తెలిపారు. దీనికి అనుకూలంగా బీజేపీ కూడా ట్వీట్ చేసిందన్నారు. పరిస్థితిని అంచనా వేయమని పోలీసులను కోరామని, తొలుత వారు విజయోత్సవ ప్రదర్శనకు అనుమతి ఇవ్వలేదని, తర్వాత స్టేడియంలో నిర్వహించుకునేందుకు అనుమతి ఇచ్చారన్నారు.
ఆరుగురు మినహా
తొక్కిసలాటలో మొత్తంగా 47మందిగాయపడగా వారిలో ఆరుగురు మినహా మిగిలినవారు ఆస్పత్రుల నుంచి డిశ్చార్జీ అయ్యారని అధికారులు తెలిపారు. తీవ్రంగా గాయపడిన ఆ ఆరుగురు ఇంకా చికిత్స తీసుకుంటున్నారని డాక్టర్లు తెలిపారు.
కొత్త మార్గదర్శకాలు
భవిష్యత్తులో ఇలాంటి మెగా ఈవెంట్లను నిర్వహించడానికి కొన్ని పద్దతులు, విధి విధానాలను రూపొందించనున్నట్టు కర్నాటక ప్రభుత్వం తెలిపింది. హోంమంత్రి పరమేశ్వర గురువారం మాట్లాడుతూ పెద్ద ఎత్తున జరిగే ఇటువంటి ఉత్సవాలు, సభల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసేందుకు అనుసరించాల్సిన పద్దతులు, మార్గదర్శకాలు రూపొందిస్తామన్నారు.
గుణపాఠం నేర్చుకోవాలి
ఇలాంటి వైఫల్యాలు, విపత్కర పరిస్థితులు, పర్యవసానాల నుంచి మనం కచ్చితంగా గుణపాఠం నేర్చుకోవాల్సి వుందని కర్నాటక డిప్యూటీ ముఖ్యమంత్రి డి.కె.శివకుమార్ వ్యాఖ్యానించారు. ప్రతిపక్షాలు శవాలపై ఎన్ని రాజకీయాలు చేసినా, ఆ చిన్నారులను చూస్తుంటే మనస్సు కలిచివేస్తోందని, వారి బాధ నాకు కనిపిస్తోందని అన్నారు.
మరింత సమన్వయం వుంటే
నిజమే, తప్పు జరిగింది, మరింత మెరుగైన ప్రణాళికతో, మరింత సమన్వయంతో ముందుకెళ్ళి వుంటే ఈ విషాద ఘటనను నివారించి వుండగలిగేవారమనిమంత్రి ప్రియాంకఖర్గే వ్యాఖ్యానించారు. ఎంతలా కృషి చేసినా, లక్షల్లోని ఆ జనాలను కంట్రోల్ చేయలేకపోయామని అన్నారు.
రికార్డు స్థాయిలో 9.66లక్షల మంది ప్రయాణికులు
తొక్కిసలాటజరిగిన రోజు రికార్డు స్థాయిలో మెట్రో రైళ్ళలో 9.66లక్షల మంది ప్రయాణికులు ప్రయాణించారని బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (బీఎంఆర్సీఎల్) తెలిపింది. రద్దీని తట్టుకునేందుకు గానూ క్యుఆర్ కోడ్ టిక్కెట్లను, స్మార్ట్ కార్డులను, టోకెన్లను వేటినీ స్కానింగ్ చేయకుండానే లోపలకు వెళ్ళే:దుకు అనుమతించింది. దీన్ని బట్టి చూస్తే నమోదైన వారి కన్నా ప్రయాణికుల సంఖ్య ఇంకా ఎక్కువే వుండొచ్చునని భావిస్తున్నారు.
సరిగా సన్నద్ధం కాలేకపోయాం కోర్టులో అంగీకరించిన రాష్ట్రప్రభుత్వం
అన్ని రకాల భద్రతా చర్యలు తీసుకున్నప్పటికీ ఊహించని రీతిలో జనాలు రావడంతో తొక్కిసలాట జరిగిందని అడ్వకేట్ జనరల్ తెలిపారు. ఈ ఘటనపై చేపట్టిన చర్యలను, ప్రభుత్వానికి సంబంధించిన వివరాలను కోర్టుకు అడ్వకేట్ జనరల్ వివరించారు. భద్రతాపరంగా అన్ని పటిష్టమైన చర్యలు చేపట్టామన్నారు. అయినా దాదాపు రెండున్నర లక్షలకు పైగా వచ్చిన జనాలను నియంత్రించడంలో విఫలమయ్యామని ప్రభుత్వం అంగీకరించింది. తొక్కిసలాట ఘటనపై విచారణకు ఆదేశించామని, 15 రోజుల్లోగా కోర్టుకు నివేదిక సమర్పిస్తామని తెలిపారు. ఈదర్యాప్తును సిఐడికి అప్పగించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. దర్యాప్తు కూలంకషంగా, స్వతంత్రంగా జరిగేందుకు వీలుగా సీఐడీలో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేస్తామని తెలిపింది.
ఫస్ట్ ఎయిడ్ కూడా అందలేదు…
ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి ముందుగా తాము దాదాపుగా నాలుగు గంటలు వేచి వుండాల్సి వచ్చిందని ఈ తొక్కిసలాటలో మరణించిన 15ఏండ్ల బాలిక దివ్యాన్షి కుటుంబం తెలిపింది. అధికారులు వచ్చారు, చూశారు, వెళ్ళారు, కానీ సరైన సాయం అందించలేదు. చివరకు సరిగ్గా ప్రాధమిక చికిత్స కూడా అందలేదని బాలిక తండ్రి వాపోయారు. పోలీసుల నుంచి ఎలాంటి సాయం లేకుండానే తన కూతురిని ఆటోలో తీసుకెళ్లాల్సి వచ్చిందని చెప్పారు.