– ప్రత్యేక పార్లమెంట్ సమావేశం ఏర్పాటు చేయాలి
– ప్రధాని మోడీకి లోక్సభ, రాజ్యసభ
– ప్రతిపక్షనేతలు రాహుల్, ఖర్గే లేఖలు
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్-పాక్ మధ్య జరిగిన కాల్పుల విరమణ ఒప్పందంతో పాటు దేశ భద్రతపై చర్చించేందుకు వెంటనే ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. ఈ మేరకు ఆదివారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే వేర్వేరుగా లేఖలు రాశారు. ప్రతిపక్షాల తరపున లేఖ రాస్తున్నట్టు రాహుల్ గాంధీ పేర్కొన్నారు. పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్, కాల్పుల విరమణపై అమెరికా అధ్యక్షుడు తొలుత ప్రకటించడంపై పార్లమెంట్లో చర్చించాలని రాహుల్ తన లేఖలో డిమాండ్ చేశారు. రాబోయే సవాళ్లను ఎదుర్కోవడానికి మన సమిష్టి సంకల్పాన్ని ప్రదర్శించడానికి ఇది ఒక అవకాశమన్నారు. ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల నిర్వహణ డిమాండ్ను ప్రధాని మోడీ తీవ్రంగా పరిగణిస్తారని విశ్వసిస్తున్నట్టు ఆశాభావం వ్యక్తం చేశారు. పహల్గాంలో ఉగ్రవాద దాడి నేపథ్యంలో పార్లమెంట్ ఉభయసభల ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ఏప్రిల్ 28న లేఖ రాసినట్టు మల్లికార్జున ఖర్గే తన లేఖలో గుర్తు చేశారు. తాజా పరిణామాల దృష్ట్యా పహల్గాం ఉగ్రవాదం, ఆపరేషన్ సిందూర్, భారత్ పాకిస్తాన్ కాల్పుల విరమణ, అమెరికా ప్రకటనలపై చర్చించడానికి పార్లమెంటు ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే అన్ని ప్రతిపక్ష పార్టీల ఏకగ్రీవ అభ్యర్థనను లోక్సభ ప్రతిపక్ష నేత లేఖలో రాసినట్టు గుర్తు చేశారు. రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడిగా తాను ఈ అభ్యర్థనను సమర్థిస్తున్నట్టు స్పష్టం చేశారు.
కాల్పుల విరమణను ట్రంప్ ఎలా ప్రకటిస్తారు?
- Advertisement -
- Advertisement -