నవతెలంగాణ-హైదరాబాద్: పాశమైలారం చిగాచి కెమికల్స్లో అగ్ని ప్రమాద ఘటనను రాష్ట్ర మానవహక్కుల కమిషన్ (హెచ్ఆర్సి) సుమోటోగా స్వీకరించింది. పాశమైలారంలో సోమవారం ఉదయం జరిగిన అగ్ని ప్రమాదంలో 19మంది మరణించిన సంగతి తెలిసిందే. మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతున్నట్లు అధికారులు తెలిపారు.
40మందికి పైగా ఆచూకీ గల్లంతైనట్లు సమాచారం. ఈ ఘటనను మంగళవారం సుమోటోగా స్వీకరించిన హెచ్ఆర్సి నోటీసులు జారీ చేసింది. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టి, జులై 30లోగా నివేదిక సమర్పించాల్సిందిగా జిల్లా కలెక్టర్, లేబర్ కమిషనర్, ఫైర్ డీజీ, జిల్లా ఎస్పీకి హెచ్ఆర్సి ఆదేశాలు జారీ చేసింది. పాత మిషనరీ, అధికారులు చూసి చూడనట్లు వ్యవహరించడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు జాతీయ బిసి దళ్ అధ్యక్షుడు, న్యాయవాది దుండ్ర కుమారస్వామి హెచ్ఆర్సికి ఫిర్యాదు చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులు,చిగాచి కెమికల్ ఫ్యాక్టరీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని కోరారు. స్వతంత్ర కమిటీని నియమించాలని, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కెమికల్ ఫ్యాక్టరీలలోని నాణ్యతా ప్రమాణాలపై నివేదికనిచ్చేలా అధికారులను ఆదేశించాలని కోరారు.