Friday, May 9, 2025
Homeఅంతర్జాతీయంఅత్యంత అథమ స్థితిలో మానవాభివృద్ధి

అత్యంత అథమ స్థితిలో మానవాభివృద్ధి

- Advertisement -

– ఐక్యరాజ్య సమితి ఆందోళన
ఐక్యరాజ్య సమితి:
మానవాభివృద్ధి పురోగతి అత్యంత అథమ స్థితిలో వుందని ఐక్యరాజ్య సమితి ఆందోళన వ్యక్తం చేసింది. గత 35 ఏళ్ళలో అత్యంత తక్కువ మొత్తంలో ప్రగతి నమోదైందని పేర్కొంది. ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం (యుఎన్‌డిపి) మంగళవారం విడుదల చేసిన కొత్త నివేదిక ఈ మేరకు పేర్కొంది. ”2020-2021 మధ్య కాలంలో అసాధారణ రీతిలో సంక్షోభాలు నెలకొన్న నేపథ్యంలో సుస్థిర రీతిలో కోలుకోవడానికి బదులుగా పురోగతి అనేది అసాధారణంగా బలహీనపడింది.” అని యుఎన్‌ చీఫ్‌ ఆంటానియో గుటెరస్‌ డిప్యూటీ ప్రతినిధి ఫర్హాన్‌ హక్‌ మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు. ”కృత్రి మేథస్సు (ఎఐ) యుగంలో ప్రజలు, అవకాశాలు : ఒక ఎంపిక” అనే శీర్షికతో వెలువడిన 2025 మానవాభివృద్ధి నివేదికను ఉటంకిస్తూ ఆయన మాట్లాడారు.
2024 సంవత్సరానికి పెట్టుకున్న అంచనాలు చూసినట్లైతే ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో మానవాభివృద్ధి సూచిక (హెచ్‌డిఐ)పై ప్రగతి స్తంభించిపోయిందని వెల్లడవుతోంది. ఇలా మందగించిన, స్తంభించిన ప్రగతి ఒక ‘కొత్త సాధారణ’ పరిస్థితిగా మారినట్లైతే ఇక ప్రపంచం ఏ మాత్రమూ సురక్షితంగా వుండబోదు. మరింత విభజనకు గురవుతుంది. మరింత ఆర్థిక, పర్యావరణపరమైన షాక్‌లు తగిలే అవకాశం వుందని యుఎన్‌డిపి అడ్మినిస్ట్రేటర్‌ ఆచిమ్‌ స్టెయినర్‌ పేర్కొన్నారు. ఆరోగ్య, విద్యా రంగాల్లో సాధించిన విజయాలు, ఆదాయ స్థాయిలతో సహా పలు ప్రామాణికా రంగాల్లో నెలకొన్న అభివృద్ధి ప్రగతిని ఆ నివేదిక విశ్లేషించింది. మానవాభివృద్ధి సూచిక తక్కువగా వున్న దేశాలు, అధికంగా వున్న దేశాల మధ్య అసమానతలు వరుసగా నాల్గవ ఏడాది కూడా విస్తరించాయని నివేదిక తెలియచేసింది. అత్యంత తక్కువగా వున్న హెచ్‌డిఐని కలిగి వున్న దేశాలకు అభివృద్ది సవాళ్ళనేవి అత్యంత తీవ్రంగా మారాయని, వాణిజ్య ఉద్రిక్తతలతో ఈ పరిస్థితి మరింత దారుణంగా తయారైందని నివేదిక పేర్కొంది. దీనివల్ల రుణ సంక్షోభం పెచ్చరిల్లుతుందని, నిరుద్యోగిత పెరుగుతుందని పేర్కొంది.
కృత్రిమ మేథస్సు (ఎఐ) తీసుకువచ్చే మార్పు పట్ల ఇంకా ప్రజలు ఆశాభావంతో వున్నారని కొత్తసర్వేలో వెల్లడైందని ఆ నివేదిక పేర్కొంది. ప్రతి పది మందిలో ఆరుగురు ఎఐ తమ ఉపాధిని సానుకూలంగా ప్రభావితం చేస్తుందని భావిస్తున్నారు. ఈనాడు లేకపోయినా ఉపాధి అవకాశాలు కల్పించబడతాయని ఆశిస్తున్నారు. ఎఐకి మానవీయ కోణం వుండాలని నివేదిక పేర్కొంటోంది. అవసరమైన కార్యాచరణ చేపట్టడానికి మూడు కీలకమైన రంగాలను గుర్తించింది. ఎఐకి వ్యతిరేకంగా పోటీ పడే బదులుగా ప్రజలు, ఎఐ పరస్పరం సహకరించుకుంటూ ఆర్థిక వ్యవస్థను నిర్మించడం అందులో ఒకటి. డిజైన్‌ నుండి డిప్లారుమెంట్‌ వరకు ఎఐ పూర్తి స్థాయి చట్ర పరిధిలో మానవ ఏజెన్సీని పొందుపరచడం రెండవది కాగా, 21వ శతాబ్దపు డిమాండ్లన నెరవేర్చేందుకు విద్యా, ఆరోగ్య వ్యవస్థలను ఆధునీకరించడం మూడవ రంగంగా వుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -