నవతెలంగాణ-హైదరాబాద్: కాంగ్రెస్ సీనియర్ ఎంపీ శశి థరూర్ సొంత పార్టీ నేతలు తనపై గుప్పిస్తున్న విమర్శలకు స్పందించారు. సర్జికల్ స్ట్రైక్స్పై తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని, తాను గత యుద్ధాల గురించి ఏమాత్రం ప్రస్తావించలేదని ఎక్స్లో శశి థరూర్ రాసుకొచ్చారు. 2016లో ప్రధాని మోదీ సారథ్యంలో తొలిసారి భారత సైన్యం పాక్లోకి చొచ్చుకుపోయిందని శశి థరూర్ చెప్పారని విమర్శించిన కాంగ్రెస్ నేత ఉదిత్రాజ్.. థరూర్ను బీజేపీ సూపర్ అధికార ప్రతినిధిగా నియమించాలని వ్యంగ్యంగా వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.
పాక్పై దౌత్యయుద్ధానికి అఖిలపక్ష ప్రతినిధి బృందాన్ని కేంద్రం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.ఈ ఓ బృందానికి కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ నాయకత్వం వహించారు. ఈక్రమంలో ఆయన నాయకత్వంలోని ఎంపీల బృందం యూఎస్తోపాటు తాజాగా పనామాలో పర్యటించింది. ఈనేపథ్యంలో పనామాలో విలేకరులతో మాట్లాడుతూ.. గతంలో ఉగ్రదాడులను భారత్ భరిస్తూ వచ్చిందని, కానీ, ఇటీవలి కాలంలో మాత్రం దెబ్బకు దెబ్బ తీస్తోందని పేర్కొన్నారు. మోదీ హయాంలో జరిగిన ఉరీ(2016), పుల్వా మా, పహల్గాం ఉగ్రదాడులను ప్రస్తావిస్తూ.. ఈ దాడుల అనంతరం పాకిస్థాన్లోకి వెళ్లి మరీ ఉగ్రస్థావరాలను ధ్వంసం చేశామని ప్రసంగించారు. దీంతో ఆయన వ్యాఖ్యలపై సొంతపార్టీ నేతలు విమర్శలు చేశారు.