– కెప్టెన్సీపై శుభ్మన్ గిల్ వ్యాఖ్యలు
– మూడు టెస్టులే ఆడనున్న జశ్ప్రీత్ బుమ్రా
నవతెలంగాణ-ముంబయి
ఆటగాళ్లతో స్పష్టంగా సమాచారం పంచుకోవటం, జట్టులో ప్రతి ఒక్కరికి భరోసా ఇచ్చేందుకు రోహిత్ శర్మ కెప్టెన్సీ మోడల్ను అనుసరిస్తానని భారత టెస్టు జట్టు కొత్త కెప్టెన్ శుభ్మన్ గిల్ అన్నాడు. విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ వీడ్కోలుతో టెస్టు జట్టులో భారీ లోటు ఏర్పడిందని, అయినా కొత్తవారు నిరూపించుకునేందుకు ఇదోక అవకాశమని యువ ఓపెనర్ తెలిపాడు. ఇంగ్లాండ్తో ఐదు టెస్టులు ఆడనున్న టీమ్ ఇండియా గురువారం ముంబయి నుంచి లండన్ బయల్దేరింది. ఇంగ్లాండ్ పర్యటనకు బయల్దేరే ముందు చీఫ్ కోచ్ గౌతం గంభీర్తో కలిసి శుభ్మన్ గిల్ మీడియాతో మాట్లాడాడు.
ఒత్తిడి ఎప్పుడూ ఉండేదే
‘ప్రతి పర్యటనలోనూ ఒత్తిడి ఉంటుంది. జట్టుకు ఎన్నో విజయాలు అందించిన ఇద్దరు అనుభవజ్ఞులు లేకపోవటం లోటు. ఆ ఇద్దరి స్థానాలు భర్తీ చేయటం ఎంతో కష్టం. ప్రతి సిరీస్లో, ప్రతి మ్యాచ్లోనూ ఒత్తిడి ఉంటుంది. జట్టు ఆ ఒత్తిడిని ఎదుర్కొని నిలబడి, గెలవటం పరిపాటే. నాయకత్వం విషయంలో నేను ఏ శైలిని అనుకరించటం లేదు. అనుభవంతో మరింత మెరుగవుతానని అనుకుంటున్నాను. కానీ డ్రెస్సింగ్రూమ్లో ఆటగాళ్లకు నమ్మకం ఇచ్చేందుకు, సమాచారం పంచుకోవటం సహా ఆరోగ్యకర బంధాల కోసం రోహిత్ శర్మ స్టయిల్ను అనుసరిస్తాను. ఆటగాళ్లు జట్టులో చోటుపై భద్రతా భావంతో ఉన్నప్పుడే వంద శాతం ప్రదర్శన ఇవ్వగలరు’ అని శుభ్మన్ గిల్ అన్నాడు.
పేస్ పవర్కు కొదవ లేదు
‘జశ్ప్రీత్ బుమ్రా ఏకధాటిగా ఐదు టెస్టులు ఆడకూడదని వైద్య బృందం సూచించింది. ఐదు టెస్టుల్లో అతడు ఏ టెస్టులో ఆడతాడనే విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఇంగ్లాండ్ చేరుకున్న తర్వాత మేము సమగ్రంగా చర్చిస్తాము. సిరీస్ ఫలితం, సిరీస్ సాగుతున్న తీరు వంటి అంశాలు కచ్చితంగా ప్రభావం చూపుతాయి. బుమ్రా విశ్రాంతి తీసుకున్నా, మ్యాచ్ నెగ్గగల పేసర్లు జట్టులో ఉన్నారు. బుమ్రా జట్టులో ఉంటే కచ్చితంగా బలమే. కానీ అతడు లేకపోయినా ఇతర బౌలర్లు బాధ్యత తీసుకోగలరు’ అని గిల్ అన్నాడు. గౌతం గంభీర్ మాట్లాడుతూ..’ చాంపియన్స్ ట్రోఫీ సమయంలోనూ నేను చెప్పాను. బుమ్రా లేకపోయినా మనకు మంచి ప్రతిభావంతులైన పేసర్లు అందుబాటులో ఉన్నారు. బుమ్రా వంటి ప్రపంచ శ్రేణి పేసర్ సత్తా, సామర్థ్యాలు నాకు బాగా తెలుసు. అయినా, జట్టులో ఇతర పేసర్లు సైతం మంచి ప్రతిభావంతులే. భారత్కు విజయాలు అందించగల సమర్థులే’ అని తెలిపాడు.
ఇక ‘టెండూల్కర్-అండర్సన్’ ట్రోఫీ
ప్రతిష్టాత్మక భారత్, ఇంగ్లాండ్ టెస్టు సిరీస్ను ఇక నుంచి టెండూల్కర్-అండర్సన్ ట్రోఫీగా పిలువనున్నారు. ఈ మేరకు బీసీసీఐ, ఈసీబీ నిర్ణయం తీసుకున్నాయి!. జూన్ 11న ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్ సందర్భంగా లార్డ్స్లో జరుగనున్న వేడుకలో సచిన్ టెండూల్కర్, జేమ్స్ అండర్సన్లు ట్రోఫీని ఆవిష్కరిస్తారని సమాచారం. ఇంగ్లాండ్ తరఫున 188 టెస్టులు ఆడిన జేమ్స్ అండర్సన్ గత ఏడాది వీడ్కోలు తీసుకోగా.. సచిన్ టెండూల్కర్ భారత్కు 200 టెస్టుల్లో ప్రాతినిథ్యం వహించి 2023లో వైదొలిగాడు. ఇప్పటివరకు భారత్, ఇంగ్లాండ్ టెస్టు సిరీస్ ఇంగ్లాండ్లో జరిగితే పటౌడీ ట్రోఫీ అని, భారత్లో జరిగితే ఆంటోని డి మెల్లో ట్రోఫీ అని పిలిచేవారు.
ప్రాణాల కంటే రోడ్షోలు ఎక్కువేం కాదు
ప్రజల ప్రాణాల కంటే రోడ్షోలు ఎక్కువ కాదని భారత మాజీ క్రికెటర్, టీమ్ ఇండియా చీఫ్ కోచ్ గౌతం గంభీర్ అన్నాడు. ఐపీఎల్18 చాంపియన్గా నిలిచిన రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ విజయోత్సవాలు పెను విషాదంగా మారగా.. 11 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై గంభీర్ స్పందించాడు. ‘విజయోత్సవాలకు రోడ్షోలు అవసరమని నేను ఎన్నడూ నమ్మలేదు. 2007 టీ20 ప్రపంచకప్ సాధించిన సందర్భంలోనూ నేను ఇదే అభిప్రాయంతో ఉన్నాను. ప్రజలు ప్రాణాలు ఎంతో విలువైనవి. భవిష్యత్లోనూ నేను ఇదే మాట చెప్పగలను. ఏదైనా స్టేడియంలో, ఇండోర్ వేదికల్లో విజయోత్సవాలు చేసుకోవటం మంచిది. బెంగళూర్లో జరిగినది ఎంతో విషాదకరవని’ గంభీర్ అన్నాడు. ఇదిలా ఉండగా, విజయోత్సవాల్లో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించేందుకు ఆర్సీబీ యాజమాన్యం ముందుకొచ్చింది. గాయపడి చికిత్స పొందుతున్న వారి కోసం ఆర్సీబీ కేర్స్ ఫండ్ను ఏర్పాటు చేసినట్టు ప్రాంఛైజీ ఓ ప్రకటనలో తెలిపింది. కర్ణాటక రాష్ట్ర క్రికెట్ సంఘం (కెఎస్సీఏ) సైతం మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఇవ్వనున్నట్టు ప్రకటించింది.