నవతెలంగాణ-హైదరాబాద్: అమెరికాపై దాడి చేస్తే యూఎస్ సైన్య శక్తిని చూపిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదివారం ఇరాన్ను హెచ్చరించారు. టెహ్రాన్ అణు, నిఘా సౌకర్యాలపై ఇజ్రాయిల్ దాడులతో అమెరికాకు ఎటువంటి సంబంధం లేదని పునరుద్ఘాటించారు. “ఇరాన్ ఏ రూపంలోనైనా దాడి చేస్తే, మునుపెన్నడూ చూడని స్థాయిలో అమెరికా సాయుధ దళాల పూర్తి బలం, శక్తితో ఇరాన్ పై దాడి చేస్తాం” అని ఒక పోస్ట్లో ఆయన పేర్కొన్నారు. పరిస్థితులు చేయిదాటకముందే..తమతో అణు ఒప్పందం చేసుకోవాలని ఇరాన్ దేశాన్ని ట్రంప్ హెచ్చరించారు. లేకపోతే ప్రపంచంలో ఉన్న అత్యాధునిక ఆయుధాలు ఇజ్రాయిల్ దగ్గర ఉన్నాయని, దీంతో తర్వాత జరిగే పరిణామాలకు తమకు సంబంధంలేదని ఆయన శనివారం ట్రూత్ సోషల్ వేదికగా రాసుకొచ్చారు.
ఆపరేషన్ రైజింగ్ లయన్, ఆపరేషన్ టూ ప్రామిష్ తో పేర్లతో ఇజ్రాయిల్, ఇరాన్ దేశాలు యుద్ధానికి దిగిన విషయం తెలిసిందే. వైమానిక దాడులతో రెండు దేశాల్లో బాంబుల మోత మోగుతుంది. శుక్రవారం తెల్లవారుజామున ప్రారంభమైన ఇజ్రాయిల్ ఆపరేషన్ ఇరాన్ అణు, సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుంది. టెహ్రాన్ ప్రకారం, అగ్రశ్రేణి సైనిక కమాండర్లు, అణు శాస్త్రవేత్తలు సహా అనేకమంది మృతి చెందారు.