నవతెలంగాణ-హైదరాబాద్: ఆపరేషన్ సిందూర్తో పాకిస్థాన్ బెండుతీసినా.. ఆదేశ నాయకులు మాటలతో కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారు. ఇరుదేశాల మధ్య మరోసారి ఉద్రికత్తలు పెంచే విధంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా పాక్ ప్రధాని సింధు జలాలపై వివాస్పద వ్యాఖ్యలు చేశారు.
తమ నీటిలో ఒక చుక్క లాక్కోవడానికి కూడా భారత్ను అనుమతించదని పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ హెచ్చరించారు. ఏప్రిల్ 22న పహల్గాం ఉగ్రదాడి తర్వాత 1960 నాటి సింధు జలాల ఒప్పందాన్ని (ఐడబ్ల్యుటి) భారత్ నిలిపివేసిన సంగతి తెలిసిందే. మంగళవారం ఇస్లామాబాద్లో అంతర్జాతీయ యువజన దినోత్సవం సందర్బంగా నిర్వహించిన ఒక కార్యక్రమంలో పాకిస్తాన్ ప్రధాని మాట్లాడారు. ”మీరు మా నీటిని ఆపివేస్తామని బెదిరిస్తే, పాకిస్తాన్ నుండి ఒక్క చుక్క కూడా లాక్కోలేరని గుర్తుంచుకోండి. ఇటువంటి చర్యకు ప్రయత్నిస్తే, మీకు ఎప్పటికీ మర్చిపోలేని గుణపాఠం నేర్పుతాం” అని భారత్ను హెచ్చరించారు. సింధు జలాలను పాకిస్తాన్ జీవనాడిగా పేర్కొంటూ, అంతర్జాతీయ ఒప్పందాల ప్రకారం పాకిస్తాన్ హక్కులపై ఎటువంటి రాజీ ఉండదని స్పష్టం చేశారు.