నవతెలంగాణ-హైదరాబాద్: పవన్ కల్యాణ్, బాలకృష్ణలపై ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం ఎమ్మెల్యే బాలకృష్ణ, జనసేన నేత డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, వాళ్ల సోదరులు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయలేదా అని ప్రశ్నించారు. వాళ్లను విచారించాలని డిమాండ్ చేశారు. బీజేపీతో పొత్తుపెట్టుకుంటే వాళ్లపై విచారణ జరపరా? అని ప్రశ్నించారు. వాళ్లపై ఈడీ, సీబీఐ, ఐటీ రైడ్స్ ఉండవా అని అడిగారు. మీకు పద్మభూషణ్లు ఇస్తారు, చాలా క్లీన్గా కాపాడతారని అన్నారు. ఎంత దౌర్జన్యం, ఎంత అవినీతి ఆకాశాన్ని అంటుకుందో అంటూ ఆయన మండిపడ్డారు.
బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులోకి ఈడీ ఎంటరైంది. విజయ్ దేవరకొండ, ప్రకాశ్ రాజ్ సహా 29 మంది సినీ ప్రముఖులపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసు నమోదు చేసింది. హైదరాబాద్, సైబరాబాద్ పోలీసులు నమోదుచేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ కేసు నమోదుచేసింది. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన ప్రముఖ తెలుగు నటులు రానా దగ్గుబాటితో పాటు మంచు లక్ష్మి, విజయ్ దేవరకొండ, ప్రకాశ్రాజ్, ప్రణీత, నిధి అగర్వాల్, శ్రీముఖి, రీతూ చౌదరి, యాంకర్ శ్యామల, అనన్య నాగళ్ల తదితరులపై కేసు నమోదు చేశారు. ఇక సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్లలలో నీతూ అగర్వాల్, విష్ణు ప్రియ, వర్షిణి, సిరి హనుమంతు, వసంతి కృష్ణన్, శోభా శెట్టి, అమృత చౌదరి, నయని పావని, నేహా పఠాన్, పద్మావతి, పండు, ఇమ్రాన్ ఖాన్, హర్ష సాయి, బయ్యా సన్నీ యాదవ్, టేస్టీ తేజ, బండారు సుప్రీత వంటి పేర్లు ఉన్నాయి. వీరితోపాటు మరికొందరు యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్ల్యూయెన్సర్లపై ఈడీ కేసు నమోదుచేసింది.
బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసులో పంజాగుట్ట పోలీసులు ఇప్పటికే యాంకర్లు విష్ణుప్రియ, రీతు చౌదరి, శ్రీముఖి, శ్యామలను విచారించిన విషయం తెలిసిందే. అదేవిధంగా 19మంది యాప్ ఓనర్లపై పోలీసులు కేసులు నమోదు చేశారు. జంగిల్ రమ్మి డాట్ కామ్, ఏ 23, యోలో 247 ఫెయిర్ ప్లే, జీత్విన్, విబుక్, తాజ్ 77, వివి బుక్, ధనిబుక్ 365, మామ247, తెలుగు365, ఎస్365 జై365, జెట్ఎక్స్, పరిమ్యాచ్, తాజ్777బుక్, ఆంధ్రా365 యజమానులపై కేసులు ఫైల్ అయ్యాయి.