నవతెలంగాణ-హైదరాబాద్: కోల్కతాపై దాడి చేస్తామన్న పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ వ్యాఖ్యలపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ (Rajnath Singh) ఘాటుగా స్పందించారు. ఇలాంటి రెచ్చగొట్టే ప్రకటనలను ఆయన చేయకుండా ఉండాల్సిందన్నారు. బెంగాల్పై కన్నేస్తే పాకిస్థాన్ ఎన్ని ముక్కలుగా విడిపోతుందో భగవంతుడికే తెలియాలని అన్నారు. 55 ఏళ్ల క్రితం పాకిస్థాన్ రెండు ముక్కలైనప్పుడు ఆ పరిణామాలను వాళ్లు చవిచూశారు. ఈసారి కనుక బెంగాల్పై కన్నేస్తే పాకిస్థాన్ ఎన్ని ముక్కలవుతుందో ఆ భగవంతుడికే తెలియాలి’ అని రాజ్నాథ్ చురకలు వేశారు.
మమతా బెనర్జీ సైతం కోల్కతాపై దాడి చేస్తామన్న పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ వ్యాఖ్యలపై ప్రధాని మోదీ ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. భారత్ స్పందన తీవ్రంగా ఉంటుందని ఆయన ఎందుకు హెచ్చరించలేకపోతున్నారు? అని నిలదీశారు. ప్రధాని రాజీనామాకు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో రాజ్నాథ్ సింగ్ తాజాగా స్పందించారు.



