Saturday, June 7, 2025
E-PAPER
Homeతాజా వార్తలుఇథనాల్‌ రైతులపై అక్రమ కేసులు

ఇథనాల్‌ రైతులపై అక్రమ కేసులు

- Advertisement -

– 12 మందికి రిమాండ్‌
– రైతులను దారుణంగా కొట్టిన పోలీసులు
– ఫ్యాక్టరీ అనుమతులు రద్దు చేయాలని ప్రజాసంఘాల డిమాండ్‌
– కలెక్టర్‌కు వినతిపత్రం
– అనుమతులు రద్దు చేసేవరకు పోరాటం : ప్రజలు
నవ తెలంగాణ- రాజోలి

జోగులాంబ గద్వాల జిల్లాలోని పెద్ద ధన్వాడ గ్రామంలో ఇథనాల్‌ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా బుధవారం జరిగిన అల్లర్లకు సంబంధించి 40 మంది రైతులపై పోలీసులు అక్రమ కేసులు నమోదు చేశారు. 12 మందిని కోర్టులో హాజరు పరిచి.. రిమాండ్‌కు తరలించినట్టు రాజోలి ఎస్‌ఐ జగదీశ్వర్‌ తెలిపారు. మరికొందరికి నోటీసులు ఇచ్చినట్టు చెప్పారు. ఫ్యాక్టరీ కార్యాలయంపై దాడి చేయడంతోపాటు వాహనాలను ధ్వంసం చేశారని, చట్టవిరుద్ధ కార్యక్రమాలకు పాల్పడ్డారని అన్నారు. చట్టప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. కాగా, రైతులను అరెస్టు చేయడంపై ఆయా గ్రామాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గురువారం పెద్ద ధన్వాడలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ఫ్యాక్టరీ ప్రయివేట్‌ సైన్యం కూడా తమపై దాడి చేసిందని, వారిని ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, గ్రామాలపై పడి రైతులను అరెస్టు చేశారని, పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లి చిత్రహింసలు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ్యాక్టరీని రద్దు చేసేవరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. వెంటనే ఆ 12 మందిని విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.
ఫ్యాక్టరీ అనుమతులు రద్దు చేయాలి
ఇథనాల్‌ పరిశ్రమకు ఇచ్చిన అనుమతులు వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ గురువారం పలు రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాల నేతలు గద్వాల జిల్లా కేంద్రంలో జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. తమ భూములు తీసుకోవద్దంటూ శాంతియుతంగా ఆందోళన చేస్తున్న రైతులను దుర్భాషలాడి.. భౌతిక దాడి చేయడమే కాకుండా అక్రమ కేసులు బనాయించారని ఆవేదన వ్యక్తం చేశారు. రిమాండ్‌లో ఉన్న రైతులను వెంటనే విడుదల చేయాలని, కేసులను ఎత్తేయాలని డిమాండ్‌ చేశారు. రైతులకు మద్దతు తెలిపిన రాజకీయ పార్టీల నాయకులను నిర్బంధించారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాభిప్రాయానికి వ్యతిరేకమైన ఇథనాల్‌ ఫ్యాక్టరీ అనుమతులు వెంటనే రద్దు చేసి, రైతులపై దాడి చేసిన ఫ్యాక్టరీ యజమానులపై కేసు నమోదు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా పార్టీల నాయకులు నాగర్‌దొడ్డి వెంకటరాములు, వెంకట్‌స్వామి, కురువ పుల్లయ్య, వాల్మీకి సింగరాజు, మద్దిలేటి సుభాన్‌టవర్‌ మబ్బులు, ఆంజనేయులు, జమ్మి చెడు కార్తీక్‌, బీరెల్లి దానయ్య, నాగన్న, ఉప్పే నరసింహ, శ్యాం ప్రసాద్‌, భాస్కర్‌, రవి విజరు, రాజు, నాగేష్‌ తదితరులు పాల్గొన్నారు.
సుమారు రూ.లక్షల ఆస్తి నష్టం ఇథనాల్‌ ఫ్యాక్టరీ యజమాని మంజునాథ్‌
పెద్ద ధన్వాడ గ్రామంలో 35 ఎకరాల్లో గాయత్రి ఇథనాల్‌ ఫ్యాక్టరీ నిర్మాణానికి ప్రభుత్వం అనుమతులు ఇచ్చినట్టు నిర్మాణ కంపెనీ యజమాని మంజునాథ్‌ తెలిపారు. కానీ, అడ్డుకుని నిర్మాణ ప్రాంతంలోని వాహనాలను, గుడిసెలను తగలబెట్టారని రాజోలి పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సుమారు రూ.40లక్షల ఆస్తి నష్టం జరిగినట్టు ఫిర్యాదులో పేర్కొన్నట్టు ఎస్‌ఐ జగదీశ్వర్‌ తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -