నవతెలంగాణ-హైదరాబాద్: గణేష్ నవరాత్రి ఉత్సవాలు విజయవంతంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్లోని ట్యాంక్ బండ్ పై భక్తుల రద్దీ కొనసాగుతోంది. రాత్రి 12గంటలకు ట్యాంక్ బండ్ పై ఇసుక వేస్తే రాలనంత జనం వచ్చారు. ఊరేగింపుగా వస్తూ ఒక్కో వినాయకున్ని క్యూ పద్దతిలో నిమజ్జనం చేస్తున్నారు. చిన్న వినాయకుడి విగ్రహాలు ఒకవైపు, పెద్ద విగ్రహాలను ఒకవైపు నిమజ్జనం చేశారు. రాత్రి నుంచి కిలోమీటర్ల మేర గణనాథుల వాహనాలు బారులు తీరాయి..
హుస్సేన్ సాగర్ వైపు లోయర్ ట్యాంక్ బండ్ నుంచి బషీర్ బాగ్ వరకు అనేక గణేష్ విగ్రహాలు బారులు తీరాయి. మరోవైపు పాత బస్తీ ప్రాంతం నుంచి మార్కెట్ దాకా వేలాది మంది భక్తులు పాల్గొని గణేశుని శోభాయాత్రను ఘనంగా నిర్వహిస్తున్నారు.భక్తులు అధికంగా ఉండటంతో పోలీసులు ఎప్పటికప్పుడు పరిస్థితిని పరీశిలిస్తూనే ఉన్నారు. ఎలాంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అదే విధంగా రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ప్రధాన జలాశయాల వద్ద గణేష్ భక్తులతో కోలాహలం నెలకొంది.
ఇప్పటికే హుస్సేన్ సాగర్లో సుమారుగా 60 వేల గణేష్ విగ్రహాల నిమర్జనం పూర్తయింది. ఇంకా వందల సంఖ్యలో విగ్రహాలు నిమజ్జనానికి సిద్ధంగా ఉన్నాయి. వేల కిలోమీటర్ల మేర విస్తరించిన గణేష్ శోభాయాత్రలు నగరాన్ని ఉత్సవ వాతావరణంతో అలరించాయి. ఇకపోతే, గ్రేటర్ హైదరాబాద్ మొత్తం వరకు ఇప్పటి వరకు దాదాపు 2 లక్షల 61 వేల 333 గణేష్ ప్రతిమల నిమజ్జనం పూర్తయినట్లు అధికారులు తెలిపారు. నగర వ్యాప్తంగా గణపతి నిమజ్జన వేడుకలు శ్రద్ధగా, ఆచరణాత్మకంగా కొనసాగుతున్నాయి.
ఈ వేడుకల కోసం మొత్తం 20 చెరువులు, 74 పాండ్లు ప్రైవేట్, ప్రభుత్వ భాగస్వామ్యంతో ఏర్పాటు చేయబడినట్లు బల్దియా అధికారులు వెల్లడించారు. ప్రజలు పెద్ద సంఖ్యలో చెరువులు, పాండ్ల వద్దకు తరలివచ్చి గణేష్ విగ్రహాల నిమజ్జనాన్ని జరుపుకుంటున్నారు. అయితే, భారీ శోభాయాత్రల కారణంగా నగరంలోని ప్రధాన రహదారులు పూర్తిగా బ్లాక్ అయ్యాయని, ట్రాఫిక్ ఆంక్షలు విధించబడిన నేపథ్యంలో వాహనదారులకు తీవ్రమైన ఇబ్బందులు ఏర్పడుతున్నాయి.