– సుప్రీంకోర్టు త్రిసభ్య కమిటీ సిఫారసు
– ఆయన అనుమానాస్పదంగా, అసహజంగా ప్రవర్తించారని వ్యాఖ్య
– సామగ్రి గదిలో నగదు లభించిన మాట నిజమేనని నిర్ధారణ
– తనకేమీ తెలియదన్న వర్మ వాదనను తోసిపుచ్చిన న్యాయమూర్తులు
న్యూఢిల్లీ: ఢిల్లీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మను తొలగించాలని సీనియర్ జడ్జీలతో ఏర్పడిన త్రిసభ్య కమిటీ సిఫార్సు చేసింది. ఈ సంవత్సరం మార్చిలో జస్టిస్ వర్మ నివాసంలో కాలిపోయిన ఐదు వందల రూపాయల నోట్ల కట్టలు కన్పించిన విషయం తెలిసిందే. దీనిపై దర్యాప్తు జరిపేందుకు సుప్రీంకోర్టు ముగ్గురు సీనియర్ న్యాయమూర్తులతో ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ 55 మంది సాక్షులను విచారించడంతో పాటు జస్టిస్ వర్మ స్టేట్మెంటును కూడా నమోదు చేసింది. అనంతరం 64 పేజీలతో కూడిన నివేదికను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోడీకి అందజేసింది. జస్టిస్ వర్మ అధికారిక నివాసంలో ఉన్న స్టోర్రూములో నగదు లభించిందని కమిటీ నిర్ధారించింది. ఆ సామాను గదిలోకి జస్టిస్ వర్మ, ఆయన కుటుంబ సభ్యులకు మాత్రమే ప్రవేశం ఉన్నదని, అనుమతి లేనిదే ఇతరులు అందులోకి వెళ్లలేరని తెలిపింది. ‘మార్చి 14వ తేదీ రాత్రి జస్టిస్ వర్మ నివాసంలో అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు స్టోర్రూముకు కూడా వ్యాపించాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్న సమయంలో గదిలో పూర్తిగా కాలిన, సగం కాలిపోయిన నోట్లు కన్పించాయి’ అని నివేదిక వివరించింది.
ప్రత్యక్ష సాక్షి ఏం చెప్పారు?
‘నేను గదిలో ప్రవేశించినప్పుడు ఎదురుగా, అలాగే కుడి చేతి వైపు నేలపై పెద్ద సంఖ్యలో ఐదు వందల రూపాయల నోట్లు పడి ఉన్నాయి. నేలపై అలా నోట్లు పడి ఉండడంతో దిగ్భ్రాంతి చెందాను. ఆశ్చర్యపడ్డాను. నేను నా జీవితంలో మొట్టమొదిసారిగా అన్ని నోట్లను చూడడం జరిగింది’ అని ఓ ప్రత్యక్షసాక్షి కమిటీకి చెప్పారు. కాలిపోయిన నగదు కట్టలు అత్యంత అనుమానాస్పదంగా ఉన్నాయని, అవి తక్కువ విలువైనవి కావని నివేదిక ప్రస్తావించింది. జస్టిస్ వర్మ, ఆయన కుటుంబ సభ్యుల అనుమతి లేనిదే అన్ని నోట్ల కట్టలను ఆ గదిలో పెట్టడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. జస్టిస్ వర్మ కుమార్తె దియా వర్మ, జస్టిస్ వర్మ వ్యక్తిగత కార్యదర్శి రంజిత్ కెర్కీ ప్రమేయాన్ని కూడా కమిటీ పరిశీలించింది. నగదు ఉన్న విషయాన్ని ఎవరికీ చెప్పవద్దని వీరిద్దరూ అగ్నిమాపక సిబ్బందిని కోరారు.
కమిటీ ఏం చెప్పిందంటే…
ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న తర్వాత జస్టిస్ వర్మను అభిశంసించే ప్రక్రియ మొదలు పెట్టవచ్చునని కమిటీ నిర్ధారణకు వచ్చింది. ‘భారత ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ కుమార్ (ప్రస్తుతం పదవీ విరమణ చేశారు) చేసిన ఆరోపణలకు, జస్టిస్ వర్మ అనుమానాస్పద, అసహజ ప్రవర్తనకు తగినన్ని ఆధారాలు ఉన్నాయని కమిటీ అభిప్రాయపడుతోంది. జస్టిస్ వర్మను తొలగించడానికి ఇవి సరిపోతాయి’ అని నివేదిక తెలియజేసింది. సామాను గదిలో నగదు ఉన్న విషయం తనకు కానీ, తన కుటుంబ సభ్యులకు కానీ తెలియదని, ఇంటితో సంబంధం లేకుండా విడిగా ఉండే ఆ గదిలోకి ఎవరైనా తేలికగా ప్రవేశించవచ్చునని జస్టిస్ వర్మ చేసిన వాదనను కమిటీ తోసిపుచ్చింది. అగ్నిప్రమాదం జరిగిన విషయాన్ని జస్టిస్ వర్మ కానీ, ఆయన కుటుంబ సభ్యులు కానీ పోలీసులకు లేదా సీనియర్ న్యాయమూర్తులకు తెలియజేయలేదని వేలెత్తి చూపింది. ఒకవేళ తనపై కుట్ర జరిగిందని జస్టిస్ వర్మ భావించి ఉంటే హైకోర్ట్ ప్రధాన న్యాయమూర్తికి లేదా సీజేఐకి ఎందుకు సమాచారం అందించలేదని ప్రశ్నించింది. ఆయన సరైన వివరణ ఇవ్వడంలో విఫలమయ్యారని వ్యాఖ్యానించింది.
సీజేఐ సిఫార్సుతోనే…
జస్టిస్ వర్మను అభిశంసించే విషయంపై ఏకాభిప్రాయ సాధన కోసం పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఇప్పటికే వివిధ పార్టీలతో సంప్రదింపులు జరిపారు. సిట్టింగ్ జడ్జిని బలవంతంగా పదవి నుండి తొలగించడం ఇదే మొదటిసారి అవుతుంది. అవకాశం ఉన్నప్పటికీ స్వతంత్ర భారతదేశంలో ఇప్పటి వరకూ ఏ న్యాయమూర్తినీ అభిశంసించలేదు. పదవి నుండి వైదొలిగేందుకు జస్టిస్ వర్మ ససేమిరా అనడంతో ఆయనను అభిశంసించాలని అప్పటి సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా నిర్ణయించి కేంద్రానికి సిఫార్సు చేశారు. మార్చి 25న సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన విచారణ కమిటీలో పంజాబ్ హర్యానా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ షీల్ నాగు, హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జీఎస్ సంధావాలియా, కర్నాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అను శివరామన్ సభ్యులుగా ఉన్నారు.
జస్టిస్ వర్మను అభిశంసించండి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES