– కేంద్రానికి కోల్కతా హైకోర్టు ఆదేశం
కోల్కతా: ఈ ఏడాది ఆగస్టు 1 నుంచి పశ్చిమ బెంగాల్లో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (ఎంజిఎన్ఆర్ఇజిఎ) పథకాన్ని అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోల్కతా హైకోర్టు బుధవారం ఆదేశించింది. అలాగే రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో జరిగిన ఈ పథకం అమలు, వేతనాల పంపిణీలో జరిగిన అక్రమాలపై విచారణ కొనసాగించడానికి కేంద్ర ప్రభుత్వానికి హైకోర్టు అనుమతి ఇచ్చింది. అంతేకాకుండా రాష్ట్రంలో పథకం అమలు చేస్తున్నప్పుడు ఎలాంటి చట్ట విరుద్ధం లేదా అక్రమాలు జరగకుండా నిరోధించడానికి దేశంలో ఇతర రాష్ట్రాల్లో విధించని ప్రత్యేక షరతులు, పరిమితులు, నిబంధనలు విధించే అధికారం కూడా కేంద్రానికి ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధానన్యాయమూర్తి జస్టిస్ టిఎస్ శివజ్ఞానం నేతృత్వంలోని డివిజన్ బెంచ్ ఉత్తర్వులు జారీ చేసింది. ఎంజిఎన్ఆర్ఇజిఎ పథకంలో అక్రమాలు జరుగుతు న్నాయని కేంద్రం కొన్ని అక్రమాలను గుర్తించడం వివాదం కాదని కోర్టు తెలిపింది. అక్రమాలకు సంబంధించిన ఆరోపణలపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించిందని, రికవరీలు కూడా జరిగాయని, ఈ మొత్తాన్ని పశ్చిమ బెంగాల్లోని ఎంజిఎన్ఆర్ఇజిఎస్ రాష్ట్ర నోడల్ ఏజెన్సీ బ్యాంకు ఖాతాలో కూడా జమ చేసిన విషయాన్ని ధర్మాసనం ప్రస్తావించింది. ఈ పథకం అమలును రాష్ట్రంలో కొనసాగించడానికే కోర్టు ప్రయత్నం చేస్తుందని బెంచ్ పేర్కొంది. ఈ పథకాన్ని చట్టవిరుద్ధంగా ఉపయోగించుకున్న ఏ ఒక్క వ్యక్తి కూడా తప్పించుకోలేరని కోర్టు వ్యాఖ్యానించింది. అదే సమయంలో పశ్చిమ బెంగాల్లో ఈ పథకం అమలు గురించి కోర్టు ఆందోళన చెందుతోందని, పథకం శాశ్వతంగా కోల్డ్ స్టోరేజ్లో ఉంచే పరిస్థితిని ఊహించలేమని వ్యాఖ్యానించింది. ఎంజిఎన్ఆర్ఇజిఎ పథకాన్ని రాష్ట్రంలో దాదాపు మూడేండ్ల నుంచి కేంద్రం నిలిపివేసింది.
ఆగస్టు 1 నుంచి బెంగాల్లో ‘ఉపాధి హామీ’ని అమలు చేయండి
- Advertisement -
- Advertisement -