– వరంగల్ కలెక్టరేట్ ఎదుట ధర్నా
విత్తన చట్టాన్ని ఆమోదించాలి : తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి. సాగర్
నవతెలంగాణ-వరంగల్
ఈ ఏడాది ముందస్తు వర్షాలతో వానాకాలం పంటల సాగు ప్రారంభమైందని, రైతులకు పెట్టుబడికి డబ్బులు అత్యవసరమున్నందున తక్షణమే రైతు భరోసాను రైతుల ఖాతాల్లో జమ చేయాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.సాగర్ డిమాండ్ చేశారు. రైతు భరోసాను వెంటనే జమ చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రైతుసంఘం వరంగల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం వరంగల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడారు. ఎకరాకు రూ.7,500 రైతు భరోసా ఇస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 6000కు తగ్గించిందని తెలిపారు. అదీ కూడా 2024 రబీ సీజన్లో ఇవ్వలేదన్నారు. 2025 యాసంగిలో 53.4లక్షలమందికి 72లక్షల ఎకరాలకు రూ.4,366 కోట్లు మాత్రమే చెల్లించారని అన్నారు. ఆ తరువాత చెల్లింపులు చేయలేదన్నారు. 2025-26 వానాకాలం ప్రారంభమౌ తున్నదని, 70 లక్షల మంది రైతులకు రూ.7,320 కోట్లు రైతు భరోసా కింద చెల్లించాల్సి ఉందని తెలిపారు. 18 నుంచి 59 ఏండ్ల వయస్సు కలిగిన రైతులకు మాత్రమే రూ.5లక్షల బీమా వర్తింప చేస్తున్నారని అన్నారు. దీన్ని 65 ఏండ్లకు పెంచాలని కోరారు. బీమా ప్రీమియం వల్ల కంపెనీలకు వేలకోట్ల లాభాలు వస్తున్నాయని, కాబట్టి ప్రభుత్వమే ఒక శాఖను ఏర్పాటుచేస్తే ప్రస్తుతం చెల్లించే ప్రీమియంలో సగం ప్రీమియంతో బీమా పరిహారం చెల్లించొచ్చని తెలిపారు.రాష్ట్రంలో వ్యవసాయ శాఖ పనితీరు ప్రణాళికా బద్ధంగా లేదని విమర్శించారు. నాణ్యత లేని విత్తనాలను సంస్థలు అమ్మడంతో ఏటా 5లక్షల నుంచి 6లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బ తింటున్నాయని తెలిపారు. విత్తనోత్పత్తి రాష్ట్రంగా ఉన్న తెలంగాణలో విత్తన చట్టం లేకపోవడం దారుణమన్నారు. అన్ని పంటల విత్తనాలు కలిసి రాష్ట్రానికి 20 లక్షల క్వింటాళ్లు కావాల్సి ఉందని, కానీ, రాష్ట్రంలో ఉత్పత్తి చేస్తున్న విత్తనాలను అమెరికా, రష్యా, చైనా దేశాలకు ఎగుమతులు చేస్తున్నామని తెలిపారు.
ఉత్తర భారతదేశానికి జొన్న, కూరగాయల విత్తనాలనూ రాష్ట్రం నుండే ఎగుమతి చేస్తున్నామని అన్నారు. రాష్ట్రంలో 444 విత్తన కంపెనీలు, 467 సీడ్ ప్రాసెసింగ్ యూనిట్లు పనిచేస్తున్నాయని, వీటిని వ్యవసాయ శాఖ నియంత్రించలేకపోతున్నదని అన్నారు. 5 సంవత్సరాలుగా రుణ ప్రణాళికను ప్రకటించడం గానీ, అమలు జరపడం గానీ చేయలేదన్నారు. ప్రభుత్వ బడ్జెట్ అంచనాల ప్రకారం 2024-25లో 35.25 లక్షల మంది రైతులకు రూ.90,792 కోట్ల పంట రుణాలు లక్ష్యంగా నిర్ణయించి రూ.60,713 కోట్లు (66.87శాతం) మాత్రమే పంపిణీ చేసినట్టు చెప్పారు. మొత్తం 72 లక్షల మంది రైతు కమతాలు ఉండగా బ్యాంకులు 45 లక్షల మందికి మాత్రమే రుణ సౌకర్యం కల్పిస్తున్నట్టు చెప్పారు. ఈ విధానం సరిచేసి అందరికీ పంట రుణాలు స్కేల్ ఆఫ్ పైనాన్స్ ప్రకారం వారికున్న భూమి మేరకు ఇవ్వాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తిరిగి ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజనలో చేరుతున్నామని ముఖ్యమంత్రి ప్రకటించారని, 2025-26లో మొత్తం రైతుల పంటల ఆధారంగా 2025 జూన్ 15 నాటికి కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రీమియం చెల్లించాలన్నారు. బ్యాంకు రుణాలతో సంబంధం లేకుండా రైతులందరికీ పంటల బీమా సౌకర్యం కల్పించాలని కోరారు. సన్న ధాన్యానికి క్వింటాకు రూ.500 బోనస్ మినహా మిగిలిన పంటలకు నిర్ణయించిన బోనస్ ఇవ్వడం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విత్తన చట్టాన్ని అమోదించాలని, వ్యవసాయోత్పత్తుల నిల్వకు తగిన గోదాములను నిర్మించాలన్నారు. ఈ కార్యక్రమంలో చింత మల్ల రంగయ్య, జిల్లా కార్యదర్శి ఈసంపల్లి బాబు, అధ్యక్షులు పుచ్చకాయల కృష్ణారెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు ఇస్లావత్ నెహ్రు, శ్రీనివాసరెడ్డి, కొంగర నరసింహ స్వామి, కోడెం రమేష్ మంద అఖిల్, ఈసంపల్లి మహేందర్, లక్కరాజు, పస్తం ఎల్లయ్య, ఇజ్జగిరి కనకమల్లు, కొండ్లె మల్లయ్య, అక్కపెళ్లి సుధాకర్, గొర్రె సంజీవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రైతుల ఖాతాల్లో’రైతు భరోసా’ జమచేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES