గుంటూరు: ఆశా వర్కర్పై సామూహిక హత్యాచారం కేసులో ముగ్గురికి 20 ఏళ్ల జైలు శిక్ష, ఒక్కొక్కరికి రూ.70 వేల చొప్పున జరిమానా విధిస్తూ గుంటూరు 5వ అదనపు జిల్లా జడ్జి నీలిమ మంగళవారం తీర్పునిచ్చారు. అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పల్లపు కృష్ణ కథనం ప్రకారం.. పల్నాడు జిల్లా మాచర్ల మండలం అనుపు చెంచు కాలనీకి చెందిన ఆశా వర్కర్ (46) పోయిన తన సెల్ఫోన్ను వెదుకుతుండగా నాగులవరం గ్రామానికి చెందిన మందిలి ముత్తయ్యను ఫోనును కనిపెట్టడంలో సహాయం చేయాలని 2022 సెప్టెంబర్ 16న కోరారు. ముత్తయ్య వద్ద కూలి పనులు చేసే పల్నాడు జిల్లా మాచర్ల మండలంలోని బెల్లంకొండవారిపాలెం చెంచు కాలనీకి చెందిన శీలం చిన్న ఆంజనేయులు, సావిటి చిన్న అంజి, శీలం బైస్వామి కలిసి ముత్తయ్యకు మాయమాటలు చెప్పారు. తమ గ్రామానికి చెందిన శీలం వెంకన్న అనే వ్యక్తి సెల్ఫోన్లు బాగు చేయడం, పోయిన ఫోన్లు ఎక్కడుందో కనుక్కోవడం చేస్తుంటాడని చెప్పారు. రాత్రి 9.45కు ఆమెను వెంట తీసుకుని సేలం వెంకన్న వద్దకు వెళ్లారు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉండటంతో తాను సహాయం చేయలేనని పోలీసులకు రిపోర్ట్ ఇవ్వమని వెంకన్న చెప్పగా ఆమె గ్రామానికి తిరుగు ప్రయాణమయ్యారు. దుండగులు ముగ్గురు ఆమెను అనుసరించి చింతగండి వాగు వద్ద అత్యాచారం చేశారు. ఘర్షణలో ఆమె మరణించారు.
మర్నాడు ఉదయం ఇంటికి చేరిన ఆమె భర్త, కుటుంబ సభ్యులు ఆమె గురించి గ్రామంలో విచారించగా దుండగులు ముగ్గురుతో కలిసి వెంకన్న వద్దకు వెళ్లారని తెలిసింది. దాంతో గ్రామస్తులు నిందితులు ముగ్గురిని పట్టుకొని నిలదీయగా వారు నేరం ఒప్పుకున్నారు. నాగార్జునసాగర్ పోలీసులకు సమాచారం అందించగా నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నరసరావుపేట డివిజన్ దిశ పోలీస్ స్టేషన్ డిఎస్పి యు.రవిచంద్ర ఈ కేసు దర్యాప్తు చేసి కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేశారు. విచారణ అనంతరం నేరం రుజువు కావడంతో జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు.
‘ఆశా’పై హత్యాచారం కేసులోముగ్గురికి 20 ఏళ్ల జైలుశిక్ష
- Advertisement -
- Advertisement -