నవతెలంగాణ-హైదరాబాద్: ఐసీసీ మహిళల వన్డే వరల్డ్ కప్ను టీమిండియా కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ముంబాయి వేదికగా తుదిపోరులో దక్షణాఫ్రికాపై గ్రాండ్ విక్టరీ సాధించింది. ఈ గెలుపు తర్వాత భారత మహిళా క్రికెటర్ల బ్రాండ్ ఎండార్స్మెంట్ ఫీజులు ఇప్పటికే 25 శాతం నుంచి 100 శాతం వరకు పెరిగినట్లు ప్రాథమిక నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.
ఎకనామిక్ టైమ్స్ కథనం ప్రకారం జెమీమా రోడ్రిగ్స్, స్మృతి మంధాన, హర్మన్ప్రీత్ కౌర్, దీప్తి శర్మ, షఫాలీ వర్మ వంటి క్రీడాకారిణుల సోషల్ మీడియా ఖాతాలకు ఫాలోవర్లు వెల్లువెత్తారు. కొందరి ఫాలోవర్ల సంఖ్య రెట్టింపు నుంచి మూడు రెట్లు పెరిగింది. బ్రాండ్ ఎండార్స్మెంట్ ఒప్పందాల కోసం విచారణలు అపూర్వమైన రీతిలో పెరిగాయి. “విజయం సాధించిన ఉదయం నుంచే బ్రాండ్ల నుంచి విపరీతమైన స్పందన వస్తోంది. కేవలం కొత్త ఒప్పందాలకే కాకుండా, పాత ఒప్పందాలను పునరుద్ధరించుకోవడానికి కూడా కంపెనీలు ముందుకొస్తున్నాయి. ఫీజులను 25-30 శాతం పెంచాలని కోరుతున్నాయి” అని బేస్లైన్ వెంచర్స్ మేనేజింగ్ డైరెక్టర్ తుహిన్ మిశ్రా తెలిపారు.

                                    

